దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదీ: మంత్రి హరీష్‌రావు

ABN , First Publish Date - 2020-10-26T20:04:17+05:30 IST

ఎన్నికలు వస్తాయి, పోతాయని.. ప్రజల కష్టసుఖాల్లో ఎవరు నిరంతరం ఉంటారో చూడాలని

దుబ్బాక అభివృద్ధి బాధ్యత నాదీ: మంత్రి హరీష్‌రావు

సిద్ధిపేట: ఎన్నికలు వస్తాయి, పోతాయని.. ప్రజల కష్టసుఖాల్లో ఎవరు నిరంతరం ఉంటారో చూడాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. దుబ్బాక వైశ్య సధనంలో బతుకమ్మ, దసరా సందర్భంగా వైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రామలింగారెడ్డి గెలుపులో సుజాత కృషి ఎంతో ఉందని తెలిపారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసినా అతి సాధారణ జీవితం వారిదని చెప్పుకొచ్చారు. హుజూర్‌నగర్ లో గెలిచిన తరువాత 300 కోట్లు కేసీఆర్ మంజూరు చేశారని చెప్పారు. టీఆర్ఏస్ గెలిస్తే ఏమిస్తదని అంటున్న వారికి ఈ అభివృద్ధే సాక్ష్యమని అన్నారు. దుబ్బాక అభివృద్ధి బాధ్యత తనది అని మంత్రి స్పష్టం చేశారు.


నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో అభివృద్ధి చేస్తామని చెప్పామని..  గతంలో ఎన్నడూ లేని అభివృద్ధి చేసి చూపించామని తెలిపారు. సుజాత తనకు దేవుడిచ్చిన సోదరి అని.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో దుబ్బాక అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక బిజినెస్ వర్గాలకు చేయగలిగినంత సాయం చేసిందని.. ఏనాడు ఇబ్బంది పెట్టలేదని తెలిపారు. అగ్రవర్ణ పేదలకు కూడా సాయం చేస్తున్నది ఒక్క టీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. వైశ్య కార్పొరేషన్ టీఆర్ఎస్ మేనిఫాస్టోలోనే ఉన్నదన్నారు. నూటికి నూరు శాతం ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇంటింటికి నీళ్లు తెచ్చామని... సాగుకు కాళేశ్వరం నీళ్లు త్వరలోనే వస్తున్నాయన్నారు.  ఒక్క సారి కాళేశ్వరం నీళ్లు వస్తే దుబ్బాక రూపురేఖలే మారిపోతాయని తెలిపారు. సుజాతక్కను భారీ మెజారిటీతో గెలిపించి సీఎం కేసీఆర్ మనస్సు గెలుచుకుందామని.. దుబ్బాకకు భారీ ఎత్తున నిధులు తెచ్చుకుందామని తెలిపారు. నిధులపై సవాల్ విసిరితే బీజేపీ ముఖం చాటేసిందని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. 



ఎమ్మెల్యే గణేష్ గుప్త మాట్లాడుతూ... వైశ్యులను గుర్తించి పదవులు కట్టబెడుతున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. అతి త్వరలో వైశ్య కార్పొరేషన్ వస్తుందని తెలిపారు.  సర్వేలన్నీ టీఆర్ఎస్ భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు చెబుతున్నాయని అన్నారు. సుజాతను భారీ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన భాద్యత వైశ్యులపై ఉన్నదని ఎమ్మెల్యే గణేష్ పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావుతో పాటు దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త బిగాల, ఇంటర్నెశనల్ ఆర్యవైశ్య ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర గుప్త తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-26T20:04:17+05:30 IST