కేన్సర్ చికిత్సకు ప్రభుత్వం ఏడాదికి రూ.100కోట్లు ఖర్చు చేస్తోంది: హరీశ్ రావు
ABN , First Publish Date - 2022-02-04T22:04:20+05:30 IST
రాష్ట్రంలో కేన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ పధకం ప్రభుత్వం ఏడాదికి 100కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు
హైదరాబాద్: రాష్ట్రంలో కేన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ పధకం ప్రభుత్వం ఏడాదికి 100కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. శుక్రకవారం ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా నగరంలోని ఎంఎన్ జె కేన్సర్ హాస్పిటల్ లో సీటీస్కాన్, డెంటల్ ఎక్స్ రే ఓపీజీ, పేషెంట్స్ అటెండెంట్ భవనంతో పాటు మొబైల్ స్క్రీనింగ్ వాహనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ప్రతి ఏడాదిరూ. 100 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు.
నిమ్స్, ఎంఎన్జే ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. ఏడాదికి 15 వేల మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని అని హరీశ్రావు స్పష్టం చేశారు. 14 సంవత్సరాల క్రితం ఏర్పాటైన సీటీ స్కాన్ పని చేయడం లేదని చెప్పడంతో రూ. 7 కోట్ల 16 లక్షలతో అధునాతన సీటీ స్కాన్ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. క్యాన్సర్ రోగులను గుర్తించేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ. కోటితో అందుబాటులోకి తీసుకొచ్చిన మొబైల్ స్ర్కీనింగ్ వాహనాన్ని ప్రారంభించామన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ను గుర్తించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. నీనారావు చారిటబుల్ ట్రస్టు ద్వారా డాక్టర్ గోవింద్ రావు రూ. 3 కోట్లతో 300 పడకల పేషెంట్ అటెండెన్సీ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ రూ. 5 భోజన సౌకర్యం కల్పిస్తామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. రూ. 40 లక్షలతో డెంటల్ ఎక్స్రే ఓపీజీని ప్రారంభం చేసుకున్నామని తెలిపారు.
ఈహెచ్ఎస్, సింగరేణి, ఆర్టీసీ ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లతో నిర్మించిన 24 గదుల స్పెషల్ బ్లాక్ను ప్రారంభించామని మంత్రి హరీశ్రావు తెలిపారు.కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎన్జే క్యాన్సర్ బడ్జెట్ను సీఎం కేసీఆర్ రెట్టింపు చేశారని హరీశ్రావు గుర్తు చేశారు. ఈ ఆస్పత్రికి 252 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. 32 మంది డాక్టర్లు 85 మంది స్టాఫ్నర్సులు, 85 మంది టెక్నిషీయన్లను మంజూరు చేశామని చెప్పారు. రోగులు పెరుగుతున్న నేపథ్యంలో అరబిందో ఫార్మా వారు సీఎస్ఆర్ ప్రోగ్రాం కింద రూ. 65 కోట్లతో 300 పడకలతో కొత్తగా ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఇది ఏప్రిల్ నెలలోగా అందుబాటులోకి రానుందని అన్నారు. ప్రస్తుతమున్న 450 బెడ్స్కు అదనంగా ఈ 300 బెడ్స్ వస్తే 750 పడకలకు అప్గ్రేడ్ చేసుకోబోతామని మంత్రి తెలిపారు. ఎంఎన్జేకు సమీపంలోని రెండు, మూడు ఎకరాల స్థలాన్ని కూడా క్యాన్సర్ హాస్పిటల్కు అందించాలని కోరారు. ఆ స్థలాన్ని ఎంఎన్జే ఆస్పత్రికి కేటాయిస్తామని మంత్రి తెలిపారు.