Union Minister: క్రైస్తవుల సంరక్షకుడిగా సేవలందిస్తున్న మోదీ
ABN , First Publish Date - 2022-09-03T16:01:17+05:30 IST
దేశంలో క్రైస్తవులకు సంరక్షకుడిగా ప్రధాని నరేంద్రమోదీ వారికి సేవలందిస్తున్నారని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని
- కేంద్ర మంత్రి జాన్బర్లా
చెన్నై, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): దేశంలో క్రైస్తవులకు సంరక్షకుడిగా ప్రధాని నరేంద్రమోదీ వారికి సేవలందిస్తున్నారని, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తున్నారని కేంద్ర మైనారిటీల శాఖ సహాయ మంత్రి జాన్ బర్లా(Minister John Barla) అన్నారు. స్థానిక వానగరం జీసెస్ కాల్స్ సంస్థ ప్రాంగణంలో జరిగిన ఆంగ్లికన్ చర్చి 94వ వార్షికోత్సవాల సందర్భంగా జరిగిన సభలో పాల్గొని ఆయన ప్రసంగిస్తూ తాను నిరుపేద క్రైస్తవుడినని, మంత్రిగా ఎదగటానికి మోదీ సహకరించారన్నారు. దేశంలో క్రైస్తవులు రాజకీయాలవైపు దృష్టిసారించరని, దైవ ప్రార్థనాలు, నిరుపేదల సేవలకే పరిమితమవుతుంటారని తెలిపారు. క్రైస్తవులు ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. మైనారిటీలైన క్రైస్తవులకు అన్ని సదుపాయాలు కల్పించాలని ప్రధాని మోదీ ఆదేశించారని ఆయన పేర్కొన్నారు. రెవ బిషప్ జైసింగ్ అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో మధ్యప్రదేశ్(Madhya Pradesh)కు చెందిన సంఘ సేవకుడు మహమ్మద్ ఫరూఖ్ఖాన్, బిషప్లు జోష్వాప్రభు, ఎస్. మైఖేల్, ఎన్.జాన్ తదితరులు పాల్గొన్నారు.