కేంద్రం పైనా, మంత్రి అమిత్ షా పై కేటీఆర్ మండిపాటు
ABN , First Publish Date - 2022-04-09T20:49:31+05:30 IST
కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. భారతదేశం ఒక వసుదైక కుటుంబమని పేర్కొన్న కేటీఆర్ భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని అన్నారు. ఇండియాలో ఎంతో మంది వివిధ జాతులు, విభిన్న మతాల వారు నివసిస్తున్నారని చెప్పారు.
హైదరాబాద్: కేంద్రంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి మండిపడ్డారు. భారతదేశం ఒక వసుదైక కుటుంబమని పేర్కొన్న కేటీఆర్ భిన్నత్వంలో ఏకత్వమే మన బలం అని అన్నారు. ఇండియాలో ఎంతో మంది వివిధ జాతులు, విభిన్న మతాల వారు నివసిస్తున్నారని చెప్పారు. ఎవరికి వారు తమకు నచ్చిన భాష మాట్లాడతారని అన్నారు. మన దేశంలోని ప్రజలు ఏం తినాలో, ఏం ధరించాలో, ఎవరిని ప్రార్థించాలో, ఏ భాషా మాట్లాడాలో ప్రజల నిర్ణయానికే వదిలేయాలని చెప్పారు. కేటీఆర్ ట్వట్టర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పై పలు వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏ భాష మాట్లాడాలో దేశ ప్రజలను ఎందుకు నిర్ణయించుకోనివ్వకూడదంటూ ఆయన ప్రశ్నించారు. భాషా దురాభిమానం, ఆధిపత్యం చెలాయించడం వంటివి బూమరాంగ్ అవుతాయని కేటీఆర్ ఘాటుగా స్పందించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలు మాట్లాడుకునేటప్పుడు ఇంగ్లీష్, స్థానిక భాషల్లోనే కాకుండా,
తప్పకుండా హిందీలోనే మాట్లాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తీవ్రంగా తప్పుబట్టారు. అమిత్ షా వ్యాఖ్యలపై కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఘాటుగా స్పందించారు. నేను మొదట భారతీయుడిని.. ఆ తర్వాతే గర్విచందగ్గ తెలుగువాడిని, తెలంగాణవాడిని అని కేటీఆర్ తన ట్వీట్లో పేర్కొన్నారు. నా మాతృభాష తెలుగులో నేను మాట్లాడగలను. అయినప్పటికీ ఇంగ్లీష్, హిందీతో పాటు కొంచెం ఉర్దూలో కూడా మాట్లాడగలనని కేటీఆర్ తెలిపారు. దేశంలో హిందీని మాత్రమే మాట్లాడాలి అనడం, ఇంగ్లీష్ భాషను నిషేధించాలన్న ప్రతిపాదనలు యువతకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయని కేటీఆర్ పేర్కొన్నారు.