బండి సంజయ్ యాత్రపై మంత్రి కేటీఆర్ లేఖ

ABN , First Publish Date - 2022-04-15T17:28:53+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు.

బండి సంజయ్ యాత్రపై మంత్రి కేటీఆర్ లేఖ

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రపై మంత్రి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఇది ముమ్మాటికీ ప్రజా వంచన యాత్ర అని.. జుటాకోరు పార్టీ అధ్యక్షుడు చేస్తున్న దగాకోరు యాత్ర అని వ్యాఖ్యలు చేశారు. ‘‘పచ్చ బడుతున్న పాలమూరుపై కక్ష కట్టిన మీకు.. అక్కడ అడుగుబెట్టే హక్కులేదు. కృష్ణా జిలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా జలదోపిడికి జై కొడుతూ.. పాలమూరు రైతుకు ద్రోహం చేస్తున్న మీరు సిగ్గూ ఎగ్గూ లేకుండా యాత్రలు చేస్తారా. పాలమూరుకు నీళ్లిచ్చే ప్రాజెక్టులపై బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తూ.. పండుతున్న పొలాలను ఎండబెట్టాలని కుట్రలు చేసిన వాళ్ళు ఇప్పుడు కపట యాత్రలు చేస్తారా?...పాలమూరు ఎత్తి పోతల పథకానికి జాతీయ హూదా ఎందుకు ఇవ్వలేదు?.. కర్ణాటక మీద కనికరం చూపిన మీరు పాలమూరు మీద కక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నరో ... సమాధానం చెప్పాలి?.. అడుగడుగునా అన్యాయం... తెలంగాణ పుట్టకముందే కత్తిగట్టిన పార్టీ  బీజేపీ’’ అంటూ మంత్రి విరుచుకుపడ్డారు. 


‘‘విభజన హామీలు నెరవేర్చే తెలివిలేదు, నీతి ఆయోగ్ చెప్పినా నిధులిచ్చే నీతి లేదు. ప్రాజెక్టులకు జాతీయ హూదా ఇవ్వరు ఉచిత కరెంట్ ఇస్తుంటే మోటర్లకు మీటర్ల పెట్టమని బ్లాక్ మెయిల్ చేస్తారు. పండించిన పంటలు కొనకుండా రైతను గోస పుచ్చుకుంటారు. సందు దొరికితే చాలు తెలంగాణ మీద విషం గక్కుతారు . తెలంగాణ అంటేనే గిట్టని పార్టీ బీజేపీ. కడుపులో ద్వేషం పెట్టుకొని కపట యాత్రలు చేస్తే ఏం లాభం?. వరిపంటతో రాజకీయ చలిమంటలు వేసుకోవాలని అన్నదాతను ఆగం చేయాలని పన్నాగం పన్నింది మీరు కాదా?...రైతులతో  రాబందుల్లా వికృత రాజకీయం చేసి  వడ్లను కొనమని అడిగితే చేతగాదని చేతులెత్తేసిన మీరు ఇప్పుడు మిడతల దండులా యాత్రకు బయల్దేరుతరా?... రైతు ద్రోహి.. రాష్ట్ర ద్రోహి పాత్ర పోషిస్తున్న మీకు పాదయాత్ర చేసే నైతిక హక్కు లేనేలేదు. తన పాదయాత్రకు రైతు ద్రోహ యాత్ర అనో లేక రైతు ధోకా యాత్ర అని పేరు పెట్టుకుంటే మంచిది. పాదయాత్ర కాదు.. మోకాళ్ల యాత్ర చేసి తెలంగాణకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలి’’ అంటూ మంత్రి కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-04-15T17:28:53+05:30 IST