HYD: అటవీశాఖ జాతీయ వర్క్షాప్ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్
ABN , First Publish Date - 2022-02-25T19:32:41+05:30 IST
అటవీశాఖ జాతీయ వర్క్ షాప్ను మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు.
హైదరాబాద్: అటవీశాఖ జాతీయ వర్క్ షాప్ను మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆధునిక, సాంకేతిక పద్ధతుల్లో అటవీశాఖ నిర్వహణ, కంపా నిధులు సద్వినియోగం, అటవీ పునరుద్ధరణ పనులపై జాతీయ వర్క్ షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.... తెలంగాణ పచ్చదనం పెంపు కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టారన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పచ్చదనం 24 శాతం నుంచి 31 శాతానికి పెరిగిందని తెలిపారు. నగరాల్లో భవనాలు కూలగొట్టి చెట్లు నాటే పరిస్థితులు భవిష్యత్లో రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన మొదట్లో తమకు చెప్పారని గుర్తుచేశారు. సరళతర వాణిజ్యవిధానం తరహాలో గ్రీన్ ర్యాంకింగ్స్ తీసుకొచ్చి రాష్ట్రాల మధ్య పోటీ పెంచాలన్నారు. నెట్ జీరో కార్బన్ లక్ష్య సాధన దిశగా రాష్ట్రాలను ప్రోత్సహించేలా ర్యాంకింగ్ విధానాన్ని తీసుకురావాలని తెలిపారు. పరిశ్రమలు, పట్టణాభివృద్ధితో పాటు పచ్చదనం అత్యంత ప్రాధాన్యమైనవని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, జాతీయ అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ సి.పి. గోయల్, నేషనల్ కాంపా సీ.ఈ.ఓ సుభాష్ చంద్ర, స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి. అన్ని రాష్ట్రాలకు చెందిన పిసిసీఎఫ్లు, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.