పాలనా ఫలాలు ప్రజలకు చేరువ చేస్తున్న సీఎం కేసీఆర్: మంత్రి మల్లారెడ్డి

ABN , First Publish Date - 2022-04-29T23:24:13+05:30 IST

శామీర్ పేట మండలం లోని తూంకుంట మునిసిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శుక్రవారం సందర్శించారు.

పాలనా ఫలాలు ప్రజలకు చేరువ చేస్తున్న సీఎం కేసీఆర్: మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: శామీర్ పేట మండలం లోని తూంకుంట మునిసిపల్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయ భవనాన్ని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈసందర్భంగా నిర్మాణ పనుల పురోగతిని అధికారులతో సమీక్షించారు. నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని అధికారులు మంత్రికి వివరించారు. రాబోయే ‘మే’ నెలలో ఈ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంబించేందుకు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, దేశములో ఎక్కడా లేని విధంగా, పాలన ఫలాలు ప్రజలకు చేరువ చేయాలనే సంకల్పముతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రములోని 10 జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేశారని తెలిపారు.


ప్రతి నూతన జిల్లాలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలను నిర్మాణము చేపట్టినట్టు తెలిపారు. సమీకృత కార్యాలయ సముదాయాల వల్ల ప్రజలకు సత్వర సేవలు అందించేందుకు అవకాశం వుందన్నారు.  కొత్త జిల్లాల ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు దాదాపు అన్నీ జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యాయని మంత్రి తెలిపారు.ఈ సమీక్షా సమావేశములో ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు,జిల్లా గ్రంధా లయ సంస్థ ఛైర్మన్ నాగరాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-04-29T23:24:13+05:30 IST