Union Minister: కడలిని సంరక్షించుకోవడం అందరి బాధ్యత
ABN , First Publish Date - 2022-09-18T13:35:38+05:30 IST
స్వదేశాన్ని కాపాడుకుంటున్నట్లే కడలిని కూడా సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రచార, మత్స్య, పశు సంవర్ధక,
- కేంద్రమంత్రి ఎల్.మురుగన్
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 17: స్వదేశాన్ని కాపాడుకుంటున్నట్లే కడలిని కూడా సంరక్షించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని కేంద్ర సమాచార ప్రచార, మత్స్య, పశు సంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ సహాయ మంత్రి డా.ఎల్.మురుగన్(Minister Dr. L. Murugan) పేర్కొన్నారు. శనివారం అంతర్జాతీయ సముద్రతీర ప్రాంతాల పరిశుభ్రతా దినాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) 72వ జన్మదినం సందర్భంగా రాజధాని నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో కేంద్రమంత్రి పాల్గొన్నారు. బీసెంట్నగర్ ఎలియట్స్ బీచ్లో మారథాన్ను జెండా ఊపి ప్రారంభించిన మంత్రి, క్రీడాకారులు, స్వచ్ఛంధ సేవా సంస్థల ప్రతినిధులతో కలసి కొంతదూరం పరుగు తీశారు. ఈ సందర్భంగా మంత్రి మురుగన్ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా సుమారు 8 వేల కి.మీ మేర 75 సముద్రతీర ప్రాంతాలు విస్తరించాయన్నారు. అఖండ బంగాళాఖాతంలో సముద్ర జీవరాశులు, ఎంతో విలువైన సంపద పుష్కలంగా వున్నాయని, ప్రకృతి వరప్రసాదంగా ఇచ్చిన ఈ సంపద భావితరాలకు అందాలని ఆకాంక్షించారు. అందువల్ల సముద్రతీర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు దానిని కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ(BJP) ప్రభుత్వం ప్రజల జీవనశైలి మెరుగుపడేలా అమలుపరుస్తున్న పీఎం ఆవాజ్ యోజన పథకం, మేకిన్ ఇండియా, స్వచ్ఛభారత్ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.