తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోకపోతే ఎంతటి పోరాటానికైనా సిద్ధం
ABN , First Publish Date - 2020-08-09T10:17:21+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో ఇటీవల తొలగించిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ మంత్రి ..
మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు
ఈవో, దేవదాయశాఖ కమిషనర్పై మండిపాటు
సింహాచలం, ఆగస్టు 8: సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో ఇటీవల తొలగించిన కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు దేవస్థానం ఈవో, దేవదాయశాఖ రాష్ట్ర స్పెషల్ కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని విధుల్లోకి తీసుకోకపోతే దీక్ష చేపట్టడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. శనివారం అప్పన్న స్వామిని మంత్రి దర్శించాక తొలగింపబడిన పలువురు ఉద్యోగులు ఆయన్ను కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఓట్లతోనే తాను ఎమ్మెల్యే, తర్వాత మంత్రినయ్యానని, వారిని తొలగించవద్దని గతంలోనే చెప్పినా ఎందుకు వినలేదంటూ ఈఓపై మండిపడ్డారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను తొలగించినట్టు ఈవో చెప్పడంతో రాష్ట్ర కమిషనర్ అర్జునరావుతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. ఉద్యోగుల తొలగింపు అంశంపై దేవదాయశాఖ మంత్రితో మాట్లాడితే సానుకూలంగా స్పందించినా, మీరెందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం జరగకపోతే ఎంతటి పోరాటానికైనా దిగుతానని ప్రకటించారు.