అన్నాడీఎంకే హయాంలోనే ‘జీ స్క్వేర్‌’కు అనుమతి

ABN , First Publish Date - 2022-06-09T16:04:26+05:30 IST

గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలోనే జీస్క్వేర్‌ సంస్థకు అనుమతులిచ్చారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ముత్తుసామి స్పష్టం చేశారు.

అన్నాడీఎంకే హయాంలోనే ‘జీ స్క్వేర్‌’కు అనుమతి

                         - మంత్రి ముత్తుస్వామి వివరణ


చెన్నై, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలోనే జీస్క్వేర్‌ సంస్థకు అనుమతులిచ్చారని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి ముత్తుసామి స్పష్టం చేశారు. కోయంబత్తూరులో జీస్క్వేర్‌ సంస్థకు చెందిన 122 ఎకరాలకు వారం రోజుల్లో లే అవుట్లకు అనుమతులిచ్చినట్లు బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆరోపణలను మంత్రి ముత్తుసామి తీవ్రంగా ఖండించారు. నగరంలో ముత్తుస్వామి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ... కోయంబత్తూరులో 122 ఎకరాలకు సం బంధించి లే అవుట్ల అనుమతి కోసం శివమాణిక్కం అనే రియల్టర్‌ సీఎండీఏకు 2019 డిసెంబర్‌ 12న దరఖాస్తు చేసుకున్నారని, అప్పటి అన్నా డీఎంకే ప్రభుత్వం పరిశీలించి 2021 జనవరి 28న ఆయనకు అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. ఈ వాస్తవాలు తెలియకుండా జీ స్క్వయర్‌ సంస్థకు డీఎంకే ప్రభుత్వం వారంరోజుల్లో అనుమతిచ్చినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. శివమాణిక్కం పేరుతోనే సీఏండీఏ అనుమతిచ్చిందని, జీస్క్వేర్‌ సంస్థ దరఖాస్తు చేయాలని ఆయన తెలిపారు. లే అవుట్లకు అనుమతిచ్చిన తర్వాత ఆ స్థలాలను జీస్క్వేర్‌ సంస్థ కొనుగోలు చేసి ఉండవచ్చునని మంత్రి ముత్తుసామి తెలిపారు. ఆ స్థలానికి సంబంధించే 2019 డిసెంబర్‌ 12న మరొక దరఖాస్తు చేసుకోగా 2021 మార్చి 30న డీసీటీపీ అప్రూవల్‌ మంజూరు చేశారని, ఈ మొత్తం వ్యవ హరాలను పరిశీలిస్తే అన్నామలై ఆరోపించినట్లుగా వారం రోజుల్లో అనుమతిచ్చిన దాఖలా లేనేలేదని ఆయన స్పష్టం చేశారు. ఇక సీఎండీఎలో కొత్తగా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ) పోస్టు ఏర్పాటు చేశారని అన్నామలై చేసిన ఆరోపణ కూడా అవాస్తవమని,  1978 నుంచి ఆ పోస్టు ఉందని, ఇప్పటికి 45 మంది ఐఏఎస్‌ అధికారులు ఆ సంస్థలో సీఈఓలుగా పనిచేశారని ముత్తుస్వామి వెల్లడించారు. ఇకనైనా అన్నామలై ఇలాంటి నిరాధారామైన ఆరోపణలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

Updated Date - 2022-06-09T16:04:26+05:30 IST