Minister: అక్రమాలపై సీఐడీతో విచారణ

ABN , First Publish Date - 2022-09-21T18:48:06+05:30 IST

రాష్ట్రంలో 2012-13, 2014-15 సంవత్సరాల్లో జరిగిన ఉపాధ్యాయ నియామక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ప్రాథమిక

Minister: అక్రమాలపై సీఐడీతో విచారణ

బెంగళూరు, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2012-13, 2014-15 సంవత్సరాల్లో జరిగిన ఉపాధ్యాయ నియామక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశాలు జారీ చేశామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి బీసీ నాగేశ్‌ ప్రకటించారు. మంగళవారం శాసనసభ జీరో అవర్‌లో బీజేపీ సభ్యుడు రాజీవ్‌ లేవనెత్తిన అంశంపై మంత్రి బదులిచ్చారు. ఉపాధ్యాయ నియామకాల్లో జరిగిన అక్రమాలు అత్యంత తీవ్రమైనవని, సమాజాన్ని బలహీన పరిచేవన్నారు. రెండేళ్ల అవధిలో 1689 మంది ఉపాధ్యాయుల నియామకాలు జరగగా అందులో పరీక్షలే రాయని, అర్హతలేనివారు ఉద్యోగాలు పొందారని పేర్కొన్నారు. ఎస్‌ఎస్ఎల్‌సీ బోర్డు డైరెక్టరేట్‌ కూడా ఈ అక్రమాలపై దర్యాప్తు జరిపిందని, నకిలీ ఉపాధ్యాయులు పాఠశాలల్లోకి ప్రవేశించారన్న సంగతి ధ్రువపడ్డాక విచారణను సీఐడీకి అప్పగించామన్నారు. విచారణ కొనసాగుతోందని, ఇప్పటికే పలువురు అరెస్టు అయ్యారని తెలిపారు. సీఐడీ వర్గాలు అందించిన సమాచారం ప్రకారం ఇలా అక్రమాలకు పాల్పడిన, సహకరించిన సుమారు 40 మంది అరెస్టు అయ్యారన్నారు. ఒక బెంగళూరు నగరంలోనే ఇంతమంది అరెస్టు అయ్యారని, ఇక మిగిలిన జిల్లాల్లో ఇంకెంతమంది అరెస్టు అవుతారో చూడాలని వ్యాఖ్యానించారు. ఈ దశలో బీజేపీ సభ్యులు అమాంతం లేచి నిలబడి ఉపాధ్యాయ నియామక అక్రమాలపై చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ఉపనేత యూటీ ఖాదర్‌ కూడా చర్చకు సుముఖత వ్యక్తం చేశారు. స్పీకర్‌ విశ్వేశ్వర హెగ్డే కాగేరి జోక్యం చేసుకుని సీఐడీ విచారణ జరుపుతున్న తరుణంలో చర్చ సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. న్యాయశాఖ మంత్రి జేసీ మాధుస్వామి మాట్లాడుతూ ఎస్‌ఐ నియామకాల అక్రమాల్లో తమ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు దుమారం లేపాయని, వాళ్ల అవధిలో జరిగిన అక్రమాలను లేవనెత్తడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ అంశంపై సభలో కొద్దిసేపు వాడిగా చర్చ జరిగింది.   

Updated Date - 2022-09-21T18:48:06+05:30 IST