మద్దతు ధర ప్రకటించపోతే కొనుగోళ్లు ఎలా?
ABN , First Publish Date - 2021-01-17T09:58:13+05:30 IST
పంట ఉత్పత్తులకు మద్దతు ధరను కేంద్రం ప్రకటించకపోతే.. కొనుగోళ్లు చేసే అవకాశమే ఉండదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు.
కొత్త చట్టాల్లో ఆ ఊసే లేదు: మంత్రి నిరంజన్రెడ్డి
హైదరాబాద్, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పంట ఉత్పత్తులకు మద్దతు ధరను కేంద్రం ప్రకటించకపోతే.. కొనుగోళ్లు చేసే అవకాశమే ఉండదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పంటలకు మద్దతు ధరను ప్రకటించాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు. కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చిందని, అందులో మద్ధతు ధర ఊసే లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేయలేని పరిస్థితులను రైతులకు వివరించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్ బోయిన్పల్లి మార్కెట్లో యాసంగి పంట మార్కెటింగ్పై.. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయ సమావేశం శనివారం జరిగింది. మంత్రి నిరంజన్రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్డ్డి, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి, ఉద్యాన సంచాలకుడు వెంకట్రామిరెడ్డి, మార్కెఫెడ్ ఎండీ భాస్కరాచారి, అన్ని జిల్లాల డీఏవోలు, డీఎంవోలు ఇందులో పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్లలోకి వచ్చే వ్యవసాయ ఉత్పత్తును క్రమబద్ధీకరించాలని సమావేశంలో నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు యాసంగి పంటల మార్కెటింగ్పై ముందస్తు ప్రణాళికలు సిద్దం చేయాలని అధికారులను మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని, సుమారు 1.13 లక్షల టన్నుల ధాన్యం దిగుమతి వస్తుందని అధికారులు అంచనాలను వివరించారు.