వరి ధాన్యం సేకరణలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2021-07-31T01:13:30+05:30 IST

వరిధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్ధానంలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.

వరి ధాన్యం సేకరణలో దేశంలో రెండో స్థానంలో తెలంగాణ: నిరంజన్ రెడ్డి

హైదరాబాద్: వరిధాన్యం సేకరణలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే రెండో స్ధానంలో ఉందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయాని్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో సభ్యుడి ప్రశ్నకు సమాధానంగా చెప్పిందన్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన చేశారు. కేంద్ర వినియోగ దారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ వెల్లడించిందన్నారు.2020-21 ఖరీఫ్ సీజన్లో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరించగా 2019-20 ఖరీఫ్ సీజన్లో 111.26 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం తెలంగాణ నుండి సేకరించినట్లు వెల్లడించారు. 


ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ అనుకూల విధానాలతోనే ఇది సాధ్యమయిందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఆకలిదప్పుల తెలంగాణ అన్నపూర్ణగా మారడానికి ఏడేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి కల్పన, ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో రైతన్నలకు అండగా నిలవడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. ఏటా 25 వేల కోట్లు సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించడంతో పాటు రైతుబంధు, రైతు భీమా, ఉచిత కరంటు వంటి పథకాలకు దాదాపు 60 వేల కోట్లు తెలంగాణ ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. 


గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రం మారాలంటే 60 శాతం మంది ఆధారపడిన వ్యవసాయ రంగం బలపడాలన్న ముందుచూపుతో కేసీఆర్ ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నారని చెప్పారు.రైతుబంధు, రైతుభీమా వంటి పథకాలతో ప్రపంచంలో రైతులకు అండగా నిలుస్తున్న రాష్ట్రం తెలంగాణ అని దేశంలో వ్యవసాయానికి ఉచితంగా 24 గంటల కరంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు.కరోనా విపత్తులోనూ రైతు నష్టపోకూడదు, ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్న రెక్కల కష్టానికి ఫలితం దక్కాలని వంద శాతం పంటలను సేకరించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి వెల్లడించారు.


Updated Date - 2021-07-31T01:13:30+05:30 IST