వానాకాలంలో 70 లక్షల ఎకరాలలో పత్తి సాగు: Niranjan reddy

ABN , First Publish Date - 2022-06-22T23:11:48+05:30 IST

వానాకాలం సీజన్ తెలంగాణలో 70 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy)తెలిపారు.

వానాకాలంలో 70 లక్షల ఎకరాలలో పత్తి సాగు: Niranjan reddy

హైదరాబాద్: వానాకాలం సీజన్ తెలంగాణలో 70 లక్షల ఎకరాలలో పత్తి సాగు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy)తెలిపారు. 15 లక్షల ఎకరాలలో కంది సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతామన్నారు. 11 లక్షల ఎకరాలకు  భూసారాన్ని పెంచే పచ్చి రొట్ట ఎరువులు పంపిణీ చేశామని, మరో 5 లక్షల ఎకరాలకు పంపిణీకి సిద్దం వుందని తెలిపారు.హైదరాబాద్ లో రైతుబంధు సమితి(rytu bandhu samiti) రాష్ట్ర అధ్యక్షుడి కార్యాలయంలో వానాకాలం విత్తనాలు, ఎరువుల లభ్యతపై ఉన్నతాధికారులతో మంత్రి నిరంజన్ రెడ్డి సమీక్షించారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమీషనర్ హన్మంతు, ఉద్యానశాఖ సలహాదారు శ్రీనివాసరావు, అదనపు సంచాలకులు విజయ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటిమీటర్లు, తేలిక నేలలలో 5 నుండి 6.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదయితేనే పంటలు విత్తుకోవడానికి సిద్దం కావాలన్నారు.తద్వారా విత్తనాలు నష్టంకావడం, మొలకశాతం దెబ్బతినడం వంటి ఇబ్బందులు తప్పుతాయని అన్నారు.రైతులు విడి విత్తనాలను కొనుగోలు చేయవద్దు. విత్తనాలను ఆధీకృత డీలర్ల వద్దనే కొనుగోలు చేయాలన్నారు. తప్పనిసరిగా రశీదు తీసుకోవడంతో పాటు విత్తిన విత్తనాల ఖాళీ ప్యాకెట్లను భద్రపరచుకోవాలన్నారు.విత్తనాలలో నాణ్యత లోపిస్తే తదుపరి చర్యలు తీసుకునేందుకు ఇవి తోడ్పడుతాయన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం సందేహాలున్నా క్షేత్రస్థాయి వ్యవసాయ అధికారులను కలిసి వివరాలు తెలుసుకోవాలన్నారు. 


నకిలీ మిరపనారు ఎవరు అమ్మినా కఠినచర్యలు తప్పవన్నారు. మిరపనారు సాగు చేసే నర్సరీలను  ఉద్యాన అధికారులు తనిఖీలు చేయాలని మంత్రి ఆదేశించారు.అవసరమయిన మేరకు అందుబాటులో ఎరువులు,భాస్వరం అందించే కాంప్లెక్స్, డీఎపీ వంటి రసాయన ఎరువులు మాత్రమే కాకుండా ఫాస్ఫోబ్యాక్టీరియా వంటి జీవన ఎరువులు రైతులు విరివిగా ఉపయోగించాలన్నారు. మితిమీరిన రసాయన ఎరువులు ఉపయోగించడం ద్వారా నేల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పంటల దిగుబడి, నాణ్యత లోపించడంతో పాటు రైతులకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతాయన్నారు.

Updated Date - 2022-06-22T23:11:48+05:30 IST