‘మంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి’
ABN , First Publish Date - 2021-01-16T06:34:10+05:30 IST
గంగపుత్రులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బట్టు నరేందర్ డిమాండ్ చేశారు.
జక్రాన్పల్లి, జనవరి 15: గంగపుత్రులపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గంగపుత్ర సంఘం జిల్లా అధ్యక్షుడు బట్టు నరేందర్ డిమాండ్ చేశారు. స్థానికంగా శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ, నాలుగేళ్ల కిందట అసెంబ్లీ సాక్షిగా చెరువులు, కుంటల్లో చేపలు పట్టుకునేందుకు మొదటి ప్రాధాన్య హక్కు గంగపుత్రులకే ఉంటుందని సీఎం కేసీఆర్ ప్రకటించారని గుర్తుచేశారు. గంగపుత్రులకు వ్యతిరేకంగా మంత్రి మాట్లాడడం సబబు కాదన్నారు.
దిష్టిబొమ్మ దహనం
ఇందల్వాయి: రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ దిష్టిబొమ్మను గంగపుత్ర సంఘం సభ్యులు స్థానిక బస్టాండ్ ఆవరణలో శుక్రవారం దహనం చేశారు. చెరువుల్లో ముదిరాజ్లకు సభ్యత్వం కల్పిస్తూ మంత్రి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దహనం చేసినట్లు సంఘం అధ్యక్షుడు భాస్కర్ తెలిపారు. గతం నుంచి చెరువులపై పూర్తిహక్కు గంగపుత్రులకే ఉందని, ముదిరాజ్లకు హక్కు కల్పిస్తూ తమ మనోభావాలను దెబ్బతీసిన విధంగానున్న మంత్రి తలసాని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే నిరసనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.