చెన్నైలోనే 50 శాతం మంది Covid బాధితులు

ABN , First Publish Date - 2022-06-24T13:01:00+05:30 IST

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల్లో 50 శాతం చెన్నైలోనే నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. అడయార్‌ కస్తూరిబా

చెన్నైలోనే 50 శాతం మంది Covid బాధితులు

                      - 10న మెగా వ్యాక్సినేషన్‌ శిబిరాలు

                      - మంత్రి ఎం.సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై), జూన్‌ 23: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసుల్లో 50 శాతం చెన్నైలోనే నమోదవుతున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం తెలిపారు. అడయార్‌ కస్తూరిబా నగర్‌లో కరోనా కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో చేపట్టిన నియంత్రణా చర్యలను పరిశీలించిన మంత్రి.. స్వల్ప లక్షణాలతో హోం క్వారంటైన్‌లో ఉన్న బాధితులను పరామర్శించారు. మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో చెన్నై, నామక్కల్‌, సేలం సహా పలు జిల్లాల్లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయని, ఫలితాల్లో ‘బీఏ4’, ‘బీఏ5’ రకం కరోనా వైర్‌సలు వ్యాప్తి అధికంగా ఉన్నట్లు తెలిసిందన్నారు. చెన్నైలో 112 వీధుల్లో ముగ్గురేసి చొప్పున, 25 వీధుల్లో ఐదుగురు చొప్పున కొవిడ్‌ బాధితులున్నారని తెలిపారు. బుధవారం గణాంకాల ప్రకారం చెన్నైలో మాత్రమే 2,225 మందికి కరోనా లక్షణాలు నిర్ధారణ కాగా, వారిలో 92 శాతం మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారని, వీరిని చెన్నై కార్పొరేషన్‌ 3,500 మంది ఫీల్డ్‌ వర్కర్స్‌ పర్యవేక్షిస్తున్నారని వివరించారు. కరోనాను ఎదుర్కొనేందుకు టీకా సరైన ఆయుధమన్నారు. రాష్ట్రంలో ఇంకా 40 లక్షల మందికి పైగా మొదటి డోస్‌, 1.30 కోట్ల మంది రెండో డోస్‌ వేసుకోలేదన్నారు. వీరికోసం జూలై 10వ తేది రాష్ట్రవ్యాప్తంగా లక్ష ప్రత్యేక శిబిరాల్లో 31వ మెగా వాక్సినేషన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా బహిరంగ ప్రాంతాల్లో మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-06-24T13:01:00+05:30 IST