ఆపార్టీని ప్రజలు బహిష్కరిస్తారు

ABN , First Publish Date - 2022-02-06T12:49:18+05:30 IST

అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన అన్నాడీఎంకేను త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు బహిష్కరిస్తారని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ధ్వజమెత్తారు. స్థానిక అన్నాసాలైలోని ఓమందూర్‌

ఆపార్టీని ప్రజలు బహిష్కరిస్తారు

- మెగా వ్యాక్సిన్‌కు విశేష స్పందన

- మంత్రి సుబ్రమణ్యం


ప్యారీస్‌(చెన్నై): అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరించిన అన్నాడీఎంకేను త్వరలో జరుగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు బహిష్కరిస్తారని వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం ధ్వజమెత్తారు. స్థానిక అన్నాసాలైలోని ఓమందూర్‌ ప్రభుత్వ మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో నిర్వహించిన 21వ మెగా టీకా శిబిరాన్ని శనివారం మంత్రి సుబ్రమణ్యం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడి యాతో మాట్లాడుతూ... నీట్‌కు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లును గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి తిప్పి పంపిన నేపథ్యంలో, శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే బహిష్కరించడం దురదృష్టకరమన్నారు. రాష్ట్ర సమస్యలు పట్టించు కోకుండా అన్నాడీఎంకే తన నైతిక బాధ్యత విస్మరించిందని, ఇందుకు ప్రజలే బుద్ధిచెబుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9.60 కోట్ల టీకాలు అందించామని, ఇందులో 90.48 శాతం మంది మొదటి డోస్‌, 69.30 శాతం రెండుడోస్‌లు వేయించుకున్నారని తెలిపారు. విల్లుపురం, తిరువణ్ణామలై వంటి జిల్లాల్లో క్యాన్సర్‌ బాధితులకు చికిత్స అందించేందుకు ఆధునిక లేజర్‌ వైద్యపరికరాలు కొనుగోలు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారుల్లో ఏర్పాటు చేసిన నిఘా వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య తగ్గిందని, గతంలో 40నుంచి 45శాతంవరకు ఉన్న ఈసంఖ్య ప్రస్తుతం 24 శాతానికి తగ్గిపోయిందన్నారు. అదే విధంగా ప్రజల వద్దకే వైద్య పథకం కింద లబ్ధ్దిపొందుతున్న వారి సంఖ్య రెండింతలు పెరిగిందని, ఇప్పటివరకు 48.30 లక్షల మందికి చికిత్స అందించి, అవసరమైన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేసినట్లు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు.

Updated Date - 2022-02-06T12:49:18+05:30 IST