Minister: ఉచిత బూస్టర్ డోస్... గడువు పొడిగించాటంటూ కేంద్రానికి లేఖ
ABN , First Publish Date - 2022-10-01T13:32:16+05:30 IST
రాష్ట్రప్రజలకు ఉచితంగా అందజేసే బూస్టర్ డోస్ గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి
- మంత్రి సుబ్రమణ్యం
ప్యారీస్(చెన్నై), సెప్టెంబరు 30: రాష్ట్రప్రజలకు ఉచితంగా అందజేసే బూస్టర్ డోస్ గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం(Health Minister M. Subramaniam) పేర్కొన్నారు. సైదాపేటలో 285 మంది గర్భిణులకు సామూహిక సీమంతం వేడుకలు మంత్రి ఎం.సుబ్రమణ్యం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గీతాజీవన్ సమక్షంలో జరిగాయి. ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్, ఎమ్మెల్యే తాయగం కవి, డిప్యూటీ మేయర్ మహే్షకుమార్, ప్రభుత్వ ఉన్నతాధికారులు అముదవల్లి, వీఆర్ జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అనంతరం మంత్రి సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ, మహానగరంలో వీధికుక్కల బెడద నివారించడం కార్పొరేషన్కు పెనుసవాలుగా మారిందని, సుమారు 30 ఏళ్ల క్రితం వీధి కుక్కలను బంధించి విద్యుదాఘాతంతో నిర్మూలించేవారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందువల్ల వీధి కుక్కలకు కు.ని శస్త్రచికిత్స చేసి వదిలేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో హెచ్1ఎన్1 ఫ్లూ జ్వరాలను నియంత్రించే దిశగా రోజుకు 1,000 ప్రాంతాల్లో టీకాలు వేయిస్తున్నామన్నారు. సామూహిక సీమంతంలో పాల్గొన్న గర్భిణులు తమ పిల్లలకు తమిళంలో నామకరణం చేయాలనే నిర్బంధం విధించలేమని, అయితే దీనిపై స్వచ్ఛంధ సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు కరోనా బూస్టర్ ఉచితంగా అందజేసేందుకు కేంద్రప్రభుత్వం విధించిన గడువు సెప్టెంబరు 30తో ముగిసిందని, ఈ గడువు పొడిగించాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాసినట్లు మంత్రి తెలిపారు.