రాష్ట్రంలో 35.52 లక్షల Covid టీకాల వృథా

ABN , First Publish Date - 2022-07-09T14:52:30+05:30 IST

సెప్టెంబరు నాటికి 35.52 లక్షల కరోనా టీకాల కాలపరిమితి ముగిసి వృథా అయ్యే అవకాశముందని, ఈ వృథా అడ్డుకొనేలా 59 ఏళ్లలోపున్న వారికి ప్రభుత్వ

రాష్ట్రంలో 35.52 లక్షల Covid టీకాల వృథా

- సెప్టెంబరుతో ముగియనున్న కాలపరిమితి

- మంత్రి సుబ్రమణ్యం


పెరంబూర్‌(చెన్నై), జూలై 8: సెప్టెంబరు నాటికి 35.52 లక్షల కరోనా టీకాల కాలపరిమితి ముగిసి వృథా అయ్యే అవకాశముందని, ఈ వృథా అడ్డుకొనేలా 59 ఏళ్లలోపున్న వారికి ప్రభుత్వ వైద్యశాలల్లో బూస్టర్‌ డోస్‌ వేసేలా అనుమతులివ్వాలని ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశంలో పెరుగుతున్న కరోనా నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై శుక్రవారం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్‌ ఎల్‌.మాండవియా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయా రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, కార్యదర్శులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఎం.సుబ్రమణ్యం మాట్లాడుతూ, రాష్ట్రంలో దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, బోధకాలు సహా పలు వ్యాధులు నియంత్రించేలా అన్నిరకాల ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 2,866 మంది డెంగ్యూ జ్వరానికి గురయ్యారని తెలిపారు. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో తగినంత మంది వైద్యులు, సిబ్బంది, అవసరమైన మందులు, వైద్య పరికారాలు సిద్ధంగా ఉంచామని తెలిపారు. రాష్ట్రంలో 21 వేల మంది కార్మికులు ఫాగింగ్‌ యంత్రాలు, క్రిమినాశిని మందుల ద్వారా దోమల నిర్మూలన చర్యల్లో పాల్గొంటున్నారని తెలిపారు. రాష్ట్రంలో మలేరియా వ్యాధి క్రమంగా తగ్గుతోందని, ఈ ఏడాది 140 మంది ఈ వ్యాధి బారిన పడ్డారని చెప్పారు. ఈ నెల 6వ తేదీ వరకు రాష్ట్రంలో 78,78,980 కరోనా టీకా నిల్వలున్నాయని, వాటిలో సెప్టెంబరు నాటికి కాలపరిమితి ముగిసే టీకాలు సంఖ్య 35.52 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు. ఈ టీకాలు వృథా కాకుండా 18 నుంచి 59 ఏళ్లలోపున్న వారు ప్రైవేటు ఆస్పత్రుల్లో కాకుండా ప్రభుత్వాస్పత్రుల్లోనే ఉచితంగా టీకాలు వేసుకొనేలా అనుమతులు జారీచేయాలని మంత్రి సుబ్రమణ్యం కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2022-07-09T14:52:30+05:30 IST