తెలంగాణ విజయ డెయిరీ టర్నోవర్ రూ.1500 కోట్లకు పెంచాలి

ABN , First Publish Date - 2021-11-25T23:57:06+05:30 IST

తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ ను రాబోయే 3 సంవత్సరాలలో 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ విజయ డెయిరీ టర్నోవర్ రూ.1500 కోట్లకు పెంచాలి

హైదరాబాద్: తెలంగాణ విజయ డెయిరీ పాల ఉత్పత్తుల అమ్మకాల టర్నోవర్ ను రాబోయే 3 సంవత్సరాలలో 1500 కోట్ల రూపాయల లక్ష్యాన్ని సాధించే విధంగా సమగ్ర కార్యాచరణ ను రూపొందించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. గురువారం తన కార్యాలయంలో తెలంగాణ విజయ డెయిరీ ఉత్పత్తుల మార్కెటింగ్, నూతన ఔట్ లెట్ ల ఏర్పాటు, ఇతర కార్యక్రమాల పై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో డెయిరీ చైర్మన్ లోక భూమారెడ్డి, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి, ఇంచార్జి డెయిరీ ఎండి అనిత రాజేంద్ర, డెయిరీ అధికారులు పాల్గొన్నారు. 


ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన విజయ డెయిరీని సీఎం కేసీఆర్  ప్రత్యేక శ్రద్ధతో అత్యధిక పాలను సేకరించి వినియోగదారులకు నాణ్యమైన పాలను, పాల ఉత్పత్తులను అందిస్తున్నదని తెలిపారు. ఎంతో ప్రజాధరణ కలిగి అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తి చేయబడుతున్న విజయ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్ళే విధంగా ఉన్నతస్థాయి మార్కెటింగ్, విస్తృత ప్రచారం పాలసీ ని రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ప్రప్రధమంగా ప్రస్తుతం ఉన్న ఔట్ లెట్ లకు అదనంగా మరిన్ని నూతన ఔట్ లెట్స్ ఏర్పాటు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ ద్వారా పాలు, పెరుగు, లస్సి, దూద్ పేడ, బాదం పాలు, నెయ్యి తో పాటు టెట్రా ప్యాక్, మలాయ్ లడ్డు, రాగి లడ్డు, మిల్లెట్ లడ్డు వంటి సుమారు 33 రకాల ఉత్పత్తులను ఔట్ లెట్ ల ద్వారా విక్రయిస్తున్నట్లు వివరించారు. 


నూతన మార్కెటింగ్ విధానాలను అవలంభిస్తూ విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లాలని తలసాని ఆదేశించారు. ప్రస్తుతం విజయ డెయిరీ టర్నోవర్ 800 కోట్ల రూపాయలుగా ఉందని, దానిని 1500 కోట్ల రూపాయలకు చేరుకొనే విధంగా సమగ్ర ప్రణాళికలను రూపొందించుకొని, నిర్దేశించిన లక్ష్యాలను చేరే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. త్వరలో ప్రారంభం కానున్న మెగా డెయిరీని  దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుండే పాల సేకరణ, ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర అంశాలపై సమగ్ర ప్రణాళికలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 


విజయ డెయిరీ ఔట్ లెట్ నిర్వహకులను మరింత ప్రోత్సహించే విధంగా అత్యధిక విక్రయాలు జరిపిన వారికి ప్రోత్సాహాకాలు అందించే విషయాన్ని కూడా పరిశీలించాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నేషనల్ హై వే అథారిటీ వారితో కుదిరిన ఒప్పందం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని ఇందల్ వాయ్, పంతంగి, కొర్లపహాడ్, పిప్పల పహాడ్, గూడూరు, గంజాల్ టోల్ గేట్ ల వద్ద విజయ తెలంగాణ పార్లర్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, రానున్న రోజులలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. బిగ్ బాస్కెట్, ప్లిప్ కార్ట్, సూపర్ డెయిరీ వంటి సంస్థల ద్వారా కూడా విజయ తెలంగాణ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రైవేట్ డెయిరీ లకు దీటుగా నెయ్యిని పెట్ జార్ లలో విక్రయిస్తున్నామని, సుగంధ పాలను కూడా పెట్ బాటిల్స్ లలో విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి శ్రీనివాస్ యాదవ్ వివరించారు.  

Updated Date - 2021-11-25T23:57:06+05:30 IST