ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు: మంత్రి Talasani
ABN , First Publish Date - 2022-07-07T18:27:49+05:30 IST
ఆషాడ బోనాల ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
హైదరాబాద్: ఆషాడ బోనాల (Bonalu) ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani srinivas yadav) తెలిపారు. గురువారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఓల్డ్ సిటీ బోనాల ఉత్సవాల నిర్వహణపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ... కరోనా కారణంగా రెండు సంవత్సరాల పాటు బోనాలు నిర్వహించుకోలేకపోయామన్నారు. ఈ నెల 17న సికింద్రాబాద్ మహంకాళి, 24న ఓల్డ్ సిటీ బోనాలకు ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. 18న మహంకాళి అమ్మవారి అంబారీ ఊరేగింపు, 25న ఉమ్మడి దేవాలయాల అంబారీ ఊరేగింపు ఉంటుందన్నారు. ప్రధాన దేవాలయాల వద్ద సాంస్కృతిక శాఖ కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. చార్మినార్ వద్ద 500 మంది కళాకారులతో కళాప్రదర్శనలు ఉంటాయన్నారు. బోనాల ఉత్సవాలకు గతంలో కంటే భక్తులు అధికంగా రానున్నారని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు పోలీసు సిబ్బంది ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.