వేదిక ఫుల్‌... జనం నిల్‌

ABN , First Publish Date - 2022-05-28T06:12:05+05:30 IST

వైసీపీ ‘సామాజిక న్యాయ భేరి’ మోగలేదు. మంత్రులు, నాయకులతో వేదిక ఫుల్‌ అయ్యింది. కానీ సభలో జనం మాత్రం నిల్‌. నగరంలోని మునిసిపల్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన ‘సామాజిక న్యాయ భేరి’ సభ వెలవెలబోయింది. వివిధ కళాశాలలు, స్కూళ్లకు చెందిన బస్సులను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలు, వృద్ధులను తీసుకొచ్చారు.

వేదిక ఫుల్‌... జనం నిల్‌
ఖాళీగా వున్న కుర్చీలు

  • ఆలస్యంగా చేరుకున్న వైసీపీ ‘సామాజిక న్యాయ భేరి’ యాత్ర బస్సు
  • అసహనంతో మంత్రులు రాకుండానే  సభా ప్రాంగణం నుంచి వెనుదిరిగిన జనం

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ‘సామాజిక న్యాయ భేరి’ మోగలేదు. మంత్రులు,  నాయకులతో వేదిక ఫుల్‌ అయ్యింది. కానీ సభలో జనం మాత్రం నిల్‌. నగరంలోని మునిసిపల్‌ స్టేడియంలో శుక్రవారం జరిగిన ‘సామాజిక న్యాయ భేరి’ సభ వెలవెలబోయింది. వివిధ కళాశాలలు, స్కూళ్లకు చెందిన బస్సులను ఏర్పాటు చేసి డ్వాక్రా మహిళలు, వృద్ధులను తీసుకొచ్చారు. సచివాలయ కార్యదర్శులతో పాటు కొంత మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా సభకు వచ్చారు. సుమారు 5-6 వేల మంది పట్టే ఈ స్టేడియంలో సాయంకాలం ఐదు గంటలకు జనాన్ని తరలించారు. కానీ 6 గంటల తర్వాత నుంచే జనం తిరుగుముఖం పట్టడం గమనార్హం. సభలో కూర్చున్న జనంలో సగం మంది ఓపిక నశించి మంత్రులు రాకుండానే తిరిగి వెళ్లిపోయారు. రాత్రి 7 గంటల సమయంలో 17 మంది మంత్రులతో కూడిన బస్సు స్టేడియంలోకి వచ్చింది. దీనిని చూసినా జనం ఆగలేదు. దీంతో పోలీసులు గేట్లు మూసి జనాన్ని ఆపాలని ప్రయత్నించారు. కానీ ఎవరూ ఆగలేదు. మంత్రులు వేదిక ఎక్కి  ఉపన్యాసాలు ఇస్తున్నా పట్టించుకోలేదు. ముగ్గురు మంత్రులు మాట్లాడేసరికే సభ ఖాళీ అయింది. పోలీసులు, సెక్యూరిటీ, వైసీపీ కార్యకర్తలు కొంతమంది మాత్రమే మిగిలారు. కొంతమంది మంత్రులు అక్కడ మిగిలిన జనాన్ని, ఖాళీ కుర్చీలను చూస్తూనే తాము చెప్పదలచుకున్నది చెప్పేశారు. సాయంకాలం నాలుగు గంటల నుంచి ట్రాఫిక్‌ సమస్య మొదలైంది. సభా ప్రాంగణం ప్రాంతానికి సుమారు రెండు కిలో మీటర్ల దూరంలో పార్కింగ్‌ స్థలాలు ఏర్పాటు చేయడం వల్ల జనం అక్కడి వరకూ నడిచి వెళ్లారు. దీంతో తీవ్ర అసంతృప్తితో వెళ్లిపోయారు.


Updated Date - 2022-05-28T06:12:05+05:30 IST