బాలిక కిడ్నాప్‌

ABN , First Publish Date - 2022-08-15T06:15:37+05:30 IST

బాలిక కిడ్నాప్‌

బాలిక కిడ్నాప్‌

దారికాచి ఇద్దరు లైంగిక వేధింపులు

మచిలీపట్నంలో నెలరోజుల కిందట ఘటన

నిందితులను బాలిక గుర్తించడంతో వెలుగులోకి..


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మైనర్‌ బాలికను ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్‌ చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నెలరోజుల క్రితం జరగ్గా, ఆదివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. మచిలీపట్నం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐ నాగరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉంటున్న 17 ఏళ్ల మైనర్‌ బాలిక ఇటీవలే పదో తరగతి పాసైంది. నెలక్రితం రాత్రి 7.30 గంటల సమయంలో తన స్నేహితురాలి ఇంటికి వెళ్లి వస్తుండగా, బచ్చుపేటకు చెందిన ఎం.నారాయణరావు, మరో వ్యక్తి దిచక్రవాహనంపై ఆమెను అనుసరించారు. దగ్గరకొచ్చి అడ్రస్‌ అడిగారు. తనకు తెలియదని బాలిక చెబుతుండగానే, ద్విచక్రవాహనంపైకి ఎక్కించుకున్నారు. చిలకలపూడి రైల్వేస్టేషన్‌ సమీపంలోని సరుగుడు తోటల వద్దకు తీసుకెళ్లారు. అక్కడ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడగా, మరొకరు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఎవరికైనా చెబితే వీడియోలు బయటపెడతామని, చంపేస్తామని బెదిరించారు. 

బాధితురాలు నిందితుడిని గుర్తుపట్టడంతో..

నెలరోజుల క్రితం బాలికపై లైంగిక వేధింపులు జరగ్గా, అప్పుడే విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అయితే, నిందితులు ఎవరో తెలియకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. రెండు రోజుల క్రితం బాలిక తనను వేధించిన నారాయణరావును గుర్తించింది. ఆమె బంధువులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. 

నిందితులను శిక్షించాలని డిమాండ్‌ 

నిందితులను కఠినంగా శిక్షించాలని బాలిక తరఫు బంధువులు మచిలీపట్నం పోలీస్‌ స్టేషన్‌ వద్ద డిమాండ్‌ చేశారు. ఇద్దరు నిందితులు లైంగిక వేధింపులకు పాల్పడగా, పోలీసులు ఒక్కరినే చూపిస్తున్నారని, రెండో వ్యక్తిని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2022-08-15T06:15:37+05:30 IST