తృటిలో తప్పిన ప్రమాదం.. ఫేస్బుక్ ఫ్రెండ్ కోసం 225 కి.మీ. వెళ్లిన బాలికకు ఎదురైన అనుభవం ఏంటంటే..
ABN , First Publish Date - 2022-04-18T19:30:29+05:30 IST
ఆ బాలిక తన తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క, బావతో కలిసి ఉంటోంది.. ఓ ఇంట్లో బేబీ సిట్టర్గా పనిచేస్తూ పదో తరగతి చదువుతోంది..
ఆ బాలిక తన తల్లిదండ్రులు చనిపోవడంతో అక్క, బావతో కలిసి ఉంటోంది.. ఓ ఇంట్లో బేబీ సిట్టర్గా పనిచేస్తూ పదో తరగతి చదువుతోంది.. ఈ నెల 10వ తేదీన ఉన్నట్టుండి ఆమె ఇంటి నుంచి అదృశ్యమైంది.. ఆమె కోసం ఎంతగానో వెతికిన అక్క, బావ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.. ఆమెను పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు.. మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఈ ఘటన జరిగింది.
ఇండోర్లోని విజయనగర్ కాలనీకి చెందిన 16 ఏళ్ల బాలిక తన అక్కాబావతో కలిసి నివసిస్తోంది. ఓ ఇంట్లో బేబీ సిట్టర్గా పనిచేస్తూ పదో తరగతి చదువుతోంది. ఆ బాలికకు ఆరు నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా అజయ్ ఖేర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. `నువ్వు చాలా అందంగా ఉన్నావు` అంటూ ఆమెను తరచుగా పొగడ్తలతో ముంచెత్తేవాడు. దీంతో ఆ బాలిక అజయ్ ట్రాప్లో పడింది. రాజస్థాన్లోని బన్స్వారాకు రావాల్సిందిగా ఆమెను అజయ్ ఆహ్వానించాడు. దీంతో ఆ బాలిక ఈ నెల 10వ తేదీన తన ఇంట్లో రూ.1500 తీసుకుని వెళ్లిపోయింది.
225 కి.మీ. ప్రయాణించి బన్స్వారాకు చేరుకుంది. ఆమెను రిసీవ్ చేసుకున్న అజయ్ ఓ ఇంట్లో బంధీగా ఉంచాడు. ఆమెను అమ్మేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. డీల్ సెట్ చేసుకున్నాడు. ఆ సమయంలో పోలీసులు ఆ ఇంటి తలుపు తట్టారు. ఆ బాలిక సెల్ఫోన్ను ట్రేస్ చేసిన పోలీసులు నిందితుడి ఇంటికి చేరుకున్నారు. పోలీసులను చూసిన నిందితుడు మేడ పై నుంచి దూకి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.