తులం బంగారం ధరను దాటేసిన క్వింటాల్ మిర్చి ధర
ABN , First Publish Date - 2022-04-04T15:53:56+05:30 IST
క్వింటాల్ దేశీయ మిర్చి ధర తులం బంగారం ధరను దాటేసింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ
వరంగల్ : ఎర్ర బంగారం(మిర్చి) ఘాటెక్కింది. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో ఎర్ర బంగారం మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం వరకూ రూ.25 నుంచి రూ.28 వేలకు పరిమితమైన మిర్చి ధర… ఒక్కసారిగా జెట్ స్పీడ్లో దూసుకెళ్లింది. క్వింటాల్ దేశీయ మిర్చి ధర తులం బంగారం ధరను దాటేసింది. వరంగల్ ఏనుమముల వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్ మిర్చి ధర రికార్డు స్థాయికి చేరుకుంది. ఇవాళ క్వింటాల్ మిర్చి ధర 55,551 రూపాయలు పలికింది. రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లకు పెద్ద ఎత్తున తేజా రకం మిర్చి అమ్మకానికి వస్తోంది. తేజా రకం మిర్చికి ప్రధానంగా చైనా, సింగపూర్, మలేషియా, థాయిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ తదితర దేశాలలో డిమాండ్ ఉంది. ఆయా దేశాలకు ఎగుమతులు ఉంటే ధరలు మరింతగా పెరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు.
పంట దెబ్బతినడంతో...
ఈ ఏడాది అధిక వర్షాలతో పాటు వైరస్ కారణంగా మిర్చి పంట బాగా దెబ్బతిన్నది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వైరస్.. మిరప పంటను దెబ్బ తీసిన కారణంగా దిగుబడి తగ్గి ధరలు ఆకాశాన్నంటాయి. మిర్చి ధరలు బహిరంగ మార్కెట్లో రికార్డులు నమోదు చేసినప్పటికీ ఎక్కువ దిగుబడి లేకపోవడంతో కొంతమేర రైతులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు.