అప్పన్న ఆలయంలో అపచారం?

ABN , First Publish Date - 2022-08-12T06:40:52+05:30 IST

వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ఆచార సంప్రదాయాలను పాటించాల్సిన వైదికులే వాటికి తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అప్పన్న ఆలయంలో అపచారం?
నోటికి గుడ్డలేకుండా చందనంలో సుగంధద్రవ్యాలు కలుపుతున్న పురోహితులు

నోటికి గుడ్డలేకుండా చందనంలో సుగంధ ద్రవ్యాల మిళితం

విశాఖపట్నం, ఆగస్టు 11: వరాహలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ఆచార సంప్రదాయాలను పాటించాల్సిన వైదికులే వాటికి తిలోదకాలిచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్వామికి పైపూతగా సమర్పించు చందనాన్ని సిబ్బంది భక్తిభావంతో నోటికి గుడ్డలు కట్టుకుని అరగదీస్తారు. ఆ చందనపు ముద్దలో ఆలయ వైదిక అధికారులు సుగంధ ద్రవ్యాలు మిళితం చేస్తారు. శుక్రవారం శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని అప్పన్నస్వామికి కిలోల కరాళ చందనం సమర్పించాల్సి ఉంది.


ఇందుకు గురువారం ఉదయం చందనపు ముద్దలో ఆలయ పురోహితులు కరి సీతారామాచార్యులు, ఏఈఓ ఎన్‌.ఆనందకుమార్‌ సమక్షంలో ముందుగా సిద్ధం చేసుకున్న సుగంధ ద్రవ్యాలను మిళితం చేశారు. అయితే అదే సమయంలో దేవస్థానం వీడియోను రికార్డు చేసి మీడియాకు విడుదల చేసింది. ఆ వీడియోలో సుగంధ ద్రవ్యాలను మిళితం చేస్తున్న పురోహితులు తమ నోటికి గుడ్డ కట్టుకోకుండా మాట్లాడటం అపచారమంటూ పలువురు అప్పన్నస్వామి భక్తులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.


కరాళ చందనం కలిపే వేళ పురోహితులు మాట్లాడటం వలన నోటిలో నుండి తుంపర్లు చందనంలో పడి కలిసే అవకాశం ఉందని, అది అపచారమే అవుతుందంటున్నారు. దీనిపై పురోహితులు సీతారామాచార్యులను వివరణ కోరగా గతంలో మాదిరిగానే సుగంధ ద్రవ్యాలను స్వామివారికి కైంకర్య భావంతో కలిపామని, ఉద్దేశ్యపూర్వకంగా అపచారం చేయలేదని చెప్పారు. కాగా, వరాహలక్ష్మీనృసింహస్వామికి శుక్రవారం తెల్లవారు జామున సుప్రభాత సేవ అనంతరం కరాళ చందనాన్ని సమర్పించనున్నారు.  

Updated Date - 2022-08-12T06:40:52+05:30 IST