రైఫిల్‌ మిస్‌ఫైర్‌

ABN , First Publish Date - 2021-05-09T06:38:04+05:30 IST

రైఫిల్‌ మిస్‌ఫైర్‌ కావడంతో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన శనివారం సాయంత్రం తిరుపతిలో జరిగింది.

రైఫిల్‌ మిస్‌ఫైర్‌
లక్ష్మీనారాయణరెడ్డి మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్పీ వెంకట అప్పలనాయుడు

హెడ్‌కానిస్టేబుల్‌ దుర్మరణం


తిరుపతి(నేరవిభాగం), మే 8: రైఫిల్‌ మిస్‌ఫైర్‌ కావడంతో ఓ హెడ్‌ కానిస్టేబుల్‌ దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన శనివారం సాయంత్రం తిరుపతిలో జరిగింది. వెస్ట్‌ పోలీసుస్టేషన్‌ సీఐ శివప్రసాద్‌ తెలిపిన వివరాల మేరకు.. పాకాలకు చెందిన రాఘవరెడ్డి కుమారుడు లక్ష్మీనారాయణరెడ్డి (49) స్థానిక ఎస్టీవీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. చిత్తూరులో ఏఆర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన అటాచ్‌మెంట్‌పై రెండు నెలలుగా తిరుపతి ప్రత్యేక జైలులో సెంట్రీగార్డు డ్యూటీ చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు విధులకు హాజరవగా, అప్పర్‌ సెంట్రీగార్డు డ్యూటీ అప్పగించారు. సాయంత్రం ఆరు గంటలకు డ్యూటీ మారే సమయం వచ్చింది. అప్పటికే రిలీవర్‌ అయిన మరో హెడ్‌ కానిస్టేబుల్‌ సిద్దారెడ్డి కూడా విధులకు వచ్చారు. దాంతో ఇంటికెళ్లడానికి సిద్ధమైన లక్ష్మీనారాయణరెడ్డి తన 303 రైఫిల్‌ పక్కన పెడుతుండగా మిస్‌ఫైర్‌ అయింది. బుల్లెట్‌ ఆయన గుండెలోకి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షి అయిన సిద్ధారెడ్డిని కూడా విచారించాక ఎస్పీ వెంకటఅప్పలనాయుడికి అధికారులు సమాచారమిచ్చారు. ఆయన సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. రైఫిల్‌ మిస్‌ఫైర్‌ అయినట్లు ఎస్పీ ప్రాథమికంగా అంచనాకు వచ్చి, కేసు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

Updated Date - 2021-05-09T06:38:04+05:30 IST