HYD : నిన్న అదృశ్యం.. శవంగా లభ్యమైన చిన్నారి.. ప్రమాదమా.. హత్యా..!?

ABN , First Publish Date - 2021-09-14T12:59:54+05:30 IST

మియాపూర్‌ ఓంకార్‌నగర్‌లో ఆదివారం ఉదయం అదృశ్యమైన 13 నెలల

HYD : నిన్న అదృశ్యం.. శవంగా లభ్యమైన చిన్నారి.. ప్రమాదమా.. హత్యా..!?

హైదరాబాద్ సిటీ/మియాపూర్‌ : మియాపూర్‌ ఓంకార్‌నగర్‌లో ఆదివారం ఉదయం అదృశ్యమైన 13 నెలల చిన్నారి సోమవారం ఉదయం మృతదేహంగా కనిపించింది. మృతిపై పోలీసులు, స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు మృతి చెందిందా, ఎవరైనా చంపేశారా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే... కర్నూలు జిల్లాకు చెందిన సుమలత, రంగస్వామి బతుకు దెరువు కోసం కొన్నేళ్ల క్రితం మియాపూర్‌ ఓంకార్‌నగర్‌కు వచ్చి పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరికి వివాహమైన నాలుగేళ్ల తర్వాత సోని (13 నెలలు) పుట్టింది. సంతానం కలగనందుకు అంతకుముందు భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. 


సోని పుట్టిన అనంతరం ఆమెను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆదివారం ఉదయం ఆడుకోవడానికి వెళ్లిన సోని అదృశ్యమైంది. తల్లిదండ్రులు చుట్టుపక్కల వెదికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం పక్కనే ఉన్న గుడిసెలో సోని మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సోని ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి మృతి చెందిందా, లేదా ఎవరైనా చంపేసి రోజంతా దాచిపెట్టి మరుసటి రోజు మృతదేహాన్ని వదిలేసి వెళ్లారా అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. శరీరంపై ఎటువంటి గాయాలూ లేవు. నీటిలో ఎక్కువ సేపు ఉండిపోవడంతో శరీరమంతా తెల్లగా మారిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-09-14T12:59:54+05:30 IST