75 ఏళ్లుగా చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి

ABN , First Publish Date - 2022-07-02T06:32:13+05:30 IST

గత 75 ఏళ్లలో మనం చాలా తప్పులు చేశామని, మూర్ఖపు సిద్ధాంతాలు, బూజు పట్టిన విధానాలతో బతికామని, ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫౌండేషనన్‌ ఆఫ్‌ డెమక్రటిక్‌ రిఫార్మ్స్‌ నేత డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ అన్నారు.

75 ఏళ్లుగా చేస్తున్న తప్పులను సరిదిద్దుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న జయప్రకాష్‌ నారాయణ

  • లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్‌ నారాయణ

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 1: గత 75 ఏళ్లలో మనం చాలా తప్పులు చేశామని, మూర్ఖపు సిద్ధాంతాలు, బూజు పట్టిన విధానాలతో బతికామని, ఆ తప్పులు మళ్లీ జరగకుండా చూసుకోవాలని లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఫౌండేషనన్‌ ఆఫ్‌ డెమక్రటిక్‌ రిఫార్మ్స్‌ నేత డాక్టర్‌ జయప్రకాష్‌ నారాయణ అన్నారు. శుక్రవారం సాయంత్రం రాజమహేంద్రవరం షెల్టాన్‌ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య, ఆరోగ్యం సక్రమంగా అందేలా ప్రభుత్వాలు దృష్టిసారించాలి. మిగతవాన్నీ పక్కన బెట్టినా ఫర్వాలేదు. ఈ విషయంలో అందరూ కలసి వస్తారని ఆశిద్దామన్నారు. మన సమాజంపై పూర్తి నమ్మకం ఉందని, అయితే రాజకీయం పట్ల నమ్మకం లేదన్నారు. సమాజం రాజకీయానికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. వచ్చే 20 ఏళ్లపాటు మన దేశానికి ఒకే లక్ష్యం కావాలని, కుల, మత, ప్రాంతీయ విద్వేషాల్లో మునిగిపోతే చాలా నష్టపోతామని అన్నారు. ఇప్పుడు జార విడుచుకుంటే మళ్లీ నిలదొక్కుకోలేమని అన్నారు. ఇప్పటికే చైనా కంటే వెనుకబడ్డామని, ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. నిజాయితీగా మాట్లాడుకుంటే విద్యలో మగపిల్లల కంటే ఆడపిల్లలే బెస్ట్‌గా ఉన్నారని, పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉందని జయప్రకాష్‌నారాయణ అన్నారు. చట్టబద్ధ పాలన కోసం లోక్‌సత్తా ప్రయత్నం చేస్తోందన్నారు. పంజాబ్‌లో అప్పులు 50 శాతం దాటిపోతున్నాయని, పశ్చిమబెంగాల్‌, రాజస్తాన్‌, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాలు అప్పులు ఎక్కువగా చేస్తున్నాయన్నారు. మనం వెనిజులా, జింబాబ్వే చూశాం. ఇప్పటికైనా మేలు కోకపోతే రాష్ట్రాలకు చాలా ప్రమాదకరమని, ఆర్థికంగా ఒకస్థాయి దాటి పతనమైతే కోట్లమంది తీవ్రంగా నష్టపోతారని అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ దూరదృష్టితో సమాఖ్య వ్యవస్థ తీసుకొచ్చారు. దీన్ని తాను సమర్థిస్తానని, జాతీయస్థాయిలో ఆర్థిక క్రమశిక్షణ కచ్చితంగా అమలు చేయాలన్నారు. విద్య, ఆరోగ్యం, చట్టబద్ధ పాలనతోనే అన్నీ సాధ్యమని స్పష్టం చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ఇలా ఉండాలని చట్టం చెప్పలేదని అయితే రాజ్యాంగ విరుద్ధమైన హామీలు ఇచ్చినప్పుడు చట్టం అడ్డుకోగలదని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బాబ్జీ, మాదిరాజు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T06:32:13+05:30 IST