Kolkata: బ్రేకింగ్ న్యూస్ చెప్పిన మిథున్ చక్రవర్తి
ABN , First Publish Date - 2022-07-27T22:38:05+05:30 IST
నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి బ్రేకింగ్ న్యూస్ చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు...
కోల్కతా: నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) బ్రేకింగ్ న్యూస్ (Breaking news) చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన 38 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారని, వారందరికీ బీజేపీతో మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 38 ఎమ్మెల్యేలలో 21 మంది అయితే నేరుగా బీజేపీతో సంప్రదింపులు సాగిస్తున్నట్టు వెల్లడించారు. మీకు బ్రేకింగ్ న్యూస్ (Breaking news) కావాలా? అని అడుగుతూ మీడియాకు మిథున్ ఈ న్యూస్ చెప్పడం విశేషం.
''మీరు బ్రేకింగ్ న్యూస్ కావాలా? ఈ క్షణంలో 38 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మాతో (బీజేపీ) చాలా మంచి సంబంధాలు నెరపుతున్నారు. వీరిలో కూడా 21 మంది నేరుగా మమ్మల్ని సంప్రదిస్తున్నారు'' అని ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ మిథున్ చెప్పారు. గత ఏడాది పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సువేందు అధికారితో సహా పలువురు టీఎంసీ నేతలు ఆ పార్టీని విడిచిపెట్టి బీజేపీలో చేరారు. అయితే ఎన్నికల్లో మమతాబెనర్జీ సారథ్యంలోని టీఎంసీ అఖండ విజయం సాధించడంతో కొందరు నేతలు మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు.