MK Stalin: ప్రధాని మోదీ ముందుకు తమిళనాడు డిమాండ్లు.. స్టాలిన్ చేసిన డిమాండ్లివే..
ABN , First Publish Date - 2022-05-27T02:11:30+05:30 IST
ప్రధాని మోదీ ముందుకు తమిళనాడు డిమాండ్లను ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకెళ్లారు. ద్రవిడయన్ మోడల్ పాలనను దేశానికి చూపిస్తామని..
చెన్నై: ప్రధాని మోదీ ముందుకు తమిళనాడు డిమాండ్లను ముఖ్యమంత్రి స్టాలిన్ తీసుకెళ్లారు. ద్రవిడయన్ మోడల్ పాలనను దేశానికి చూపిస్తామని ఆయన చెప్పారు. కేంద్రం నుంచి తమిళనాడుకు నిధులు రావడం లేదని, రాష్ట్రాలకు నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని స్టాలిన్ ప్రధానికి గుర్తు చేశారు. రాష్ట్రాలతో కేంద్రం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి జరుగుతుందని, తమిళనాడుకు జీఎస్టీ నిధులు తక్షణం విడుదల చేయాలని సభా వేదిక సాక్షిగా ప్రధానిని స్టాలిన్ డిమాండ్ చేశారు. అభివృద్ధి పథకాలు కేంద్రం ప్రారంభిస్తోందని, నిధులు మాత్రం రావడం లేదని ఆయన చెప్పారు. తమకు రావాల్సిన నిధులు మాత్రమే అడుగుతున్నామని, తమ రాష్ట్ర హక్కులు తాము వదులుకోమని సీఎం స్టాలిన్ కుండబద్ధలు కొట్టారు.
నీట్ బిల్లు రద్దు చేయాలని సీఎం స్టాలిన్ డిమాండ్ చేశారు. తమిళనాడుకు నీట్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ప్రధానిని స్టాలిన్ అభ్యర్థించారు. మద్రాస్ హైకోర్టుతో పాటు తమిళనాడులోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో తమిళ భాషను అధికారిక భాషగా ప్రకటించాలని స్టాలిన్ డిమాండ్ చేశారు. తమ రాష్ట్రంలోని మత్స్యకారులకు ఉపశమనం కలిగించేందుకు కచ్చాతీవు ప్రాంతాన్ని తమిళనాడుకు దక్కేలా చేయాలని ఆయన ప్రధానిని కోరారు.