రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వాహనం అడ్డగింత
ABN , First Publish Date - 2020-12-03T06:13:21+05:30 IST
రైతులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వాహనం అడ్డగింత
హుస్నాబాద్, డిసెంబరు 2: సన్నరకం ధాన్యం పండించిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హుస్నాబాద్లోని అంబేడ్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే వొడితెల సతీ్షకుమార్ వాహనాన్ని శివసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అయిలేని మల్లికార్జున్రెడ్డి, రైతుఐక్యతా సంఘం నాయకులు పచ్చిమట్ల రవీందర్గౌడ్ అడ్డుకున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే వాహనాన్ని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వాహనం దిగి వచ్చి వారి వద్ద కూర్చుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. సన్నరకం వరిపంట వేసిన రైతులకు దిగుబడి రాలేదని మద్దతు ధర లేకుండా పోయిందని మల్లిఖార్జున్రెడ్డి, రవీందర్గౌడ్ వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో 40కిలోల బస్తాకు తరుగు కింద అదనంగా మూడు కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారని వివరించారు. క్వింటాలుకు దాదాపు ఏడు కిలోల వరకు రైతులు నష్టపోతున్నారని తెలిపారు. సంచి బరు వు కింద బస్తాకు 750 గ్రాములు తీసుకోవాలి కానీ మూడు కిలోలు ఎక్కువ తీసుకుంటున్నారని చెప్పారు. హుస్నాబాద్లోనే ఈ మోసాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.