రాజన్న రాజ్యం అంటే నవ్వొస్తోంది
ABN , First Publish Date - 2021-04-23T09:43:38+05:30 IST
ఉద్యోగాల భర్తీకి సంబంధించి వైఎస్ షర్మిల అవగాహనలేని మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు.
షర్మిలవి అవగాహన లేని మాటలు
ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాల భర్తీకి సంబంధించి వైఎస్ షర్మిల అవగాహనలేని మాటలు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. ఆమెకు తెలంగాణపైన అవగాహన లేదని, అసలు తెలంగాణలో రాజన్న రాజ్యం అంటే నవ్వు వస్తోందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో గురువారం వారు మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా టీఆర్ఎస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్థానికులకు ఉద్యోగాలు రాకుండా ఓపెన్ కోటాలోనే భర్తీ జరిగేదని చెప్పారు.
రాష్ట్రంలో ప్రభుత్వం రెండు పంటలకు నీళ్లు అందిస్తోందని, అలాగే మన నిధులను మనమే వాడుకుంటున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యం సంపూర్ణంగా నెరవేరిందనే తాము భావిస్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం కంటే ఎక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు.