ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నాపై కక్షగట్టారు

ABN , First Publish Date - 2022-10-01T06:49:08+05:30 IST

ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కక్షపూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళతానని మాజీ ఎంపీపీ వంతల బాబూరావు అన్నారు.

ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నాపై కక్షగట్టారు
మాజీ ఎంపీపీ బాబూరావు

పీవీటీజీని అయినందునే పదవి నుంచి దించేయించారు 

ఆమె తీరుపై అధిష్ఠానానికి ఫిర్యాదు

మాజీ ఎంపీపీ వంతల బాబూరావు


చింతపల్లి, సెప్టెంబరు 30: ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి కక్షపూరిత రాజకీయాలను ప్రజల్లోకి తీసుకెళతానని మాజీ ఎంపీపీ వంతల బాబూరావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడారు. భాగ్యలక్ష్మి గెలుపునకు అహర్నిశలు శ్రమించానని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమె బి-ఫారం ఇవ్వడంతో చింతపల్లి-3 ఎంపీటీసీ నుంచి పోటీచేసి గెలిచానని చెప్పారు. ఎంపీపీ అభ్యర్థిగా తన పేరును ప్రతిపాదించారని, అయితే ఎన్నిక జరిగే రోజున తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు అనుషదేవిని ఎంపిక చేయడంతో మనస్తాపానికి గురయ్యానన్నారు. సహచర సభ్యుల ఒత్తిడి మేరకు ఎంపీపీ పదవికి పోటీ చేయాల్సి వచ్చిందని, ఇరువురికీ సమానంగా ఓట్లు రావడంతో లాటరీలో ఎంపీపీ పదవి వరించిందన్నారు. అనంతరం తనను సన్మానించిన భాగ్యలక్ష్మి... విభేదాలను పక్కనపెట్టి కలిసి పనిచేద్దామని చెప్పారన్నారు. అయితే తనను పదవి నుంచి తొలగించాలని చాపకింద నీరులా ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్నట్టు చెప్పారు. కొయ్యూరు ఎంపీపీ గిరిజనుడు కాదని ఆదివాసీ జేఏసీ నాయకులు ఫిర్యాదుచేయగా, ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ‘సర్దుబాటు’ చేశారని అన్నారు. కొంతమంది ఎంపీటీసీ సభ్యులకు ముగ్గురు పిల్లలు  వున్నప్పటికీ వారిపై ఎటువంటి ఫిర్యాదులు రాకుండా ఎమ్మెల్యే రాజకీయం నడిపారని ఆరోపించారు. తాను పీవీటీజీని అయినందునే కక్షగట్టి పదవి నుంచి తొలగించేందుకు ఎమ్మెల్యే పూనుకున్నారని అన్నారు. కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఓ తెగవారిపట్ల వివక్ష చూపుతూ రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలపై పార్టీ అధిష్ఠానికి ఫిర్యాదు చేస్తానని, రానున్న ఎన్నికల్లో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. ఎంపీటీసీ సభ్యత్వ రద్దుపై హైకోర్టుని ఆశ్రయించానని బాబూరావు తెలిపారు.

Updated Date - 2022-10-01T06:49:08+05:30 IST