ఎమ్మెల్యే గో బ్యాక్‌

ABN , First Publish Date - 2022-05-21T06:08:08+05:30 IST

‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా శుక్రవారం చిరతపూడిలో పర్యటించిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చుక్కెదురైంది. వైసీపీ అధికారంలోకి మూడేళ్లు అయినా గ్రామంలోని ప్రధాన సమస్యలు అలానే ఉన్నాయన్నారు.

ఎమ్మెల్యే గో బ్యాక్‌
చిరతపూడిలో ఎమ్మెల్యే చిట్టిబాబును నిలదీస్తున్న యువకులు

  • సమస్యలు పరిష్కరించుకుండా గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ అడ్డగింత
  • పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చిరతపూడిలో చుక్కెదురు
  • ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో అడుగడుగునా సమస్యలపై నిలదీత

అంబాజీపేట, మే 20: ‘గడప గడపకు మన ప్రభుత్వం’లో భాగంగా శుక్రవారం చిరతపూడిలో పర్యటించిన పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు చుక్కెదురైంది. వైసీపీ అధికారంలోకి మూడేళ్లు అయినా గ్రామంలోని ప్రధాన సమస్యలు అలానే ఉన్నాయన్నారు. వాటిని పరిష్కరించకుండా గ్రామంలోకి రావడానికి వీల్లేదంటూ స్థానికులు అడ్డుకున్నారు. ప్రధాన రహదారి నిర్మిస్తానని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా పట్టించకోలేదని ఎమ్మెల్యేపై మండిపడ్డారు. రహ దారిపై బైఠాయించి ఎమ్మెల్యే గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. ప్రధాన రహదారిని ఎప్పుడు నిర్మిస్తారో స్పష్టమైన హామీ ఇవ్వాలని స్థానికులు, యువకులు భీష్మించారు. ఒక దశలో ఎమ్మెల్యేకు, ప్రజలకు వాగ్వివాదం జరగడంతో ఎస్‌ఐ ఎ.చైతన్యకుమార్‌ జోక్యం చేసుకుని సమస్యను ఎమ్మె ల్యేకు వివరించాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రహదారి నిర్మాణానికి నిధులు మంజూరైనప్పటికీ టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావట్లేదన్నారు. ఆరు నెలల్లో రహదారిని పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యేకు ప్రజలు అడుగడుగునా సమస్యలతో స్వాగతం పలికారు. పింఛన్లు, గృహ నిర్మాణం, బిల్లులు, రహదారులు, డ్రైనేజీలు మొదలైన సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ప్రచురించిన బ్రోచర్లను పంపిణీ చేస్తుండగా తీసుకునేందుకు ప్రజలు విముఖత చూపారు. కార్యక్రమంలో వైసీపీ మండల శాఖ అధ్యక్షుడు వాసంశెట్టి చినబాబు, కార్యదర్శి నాగవరపు నాగరాజు, వైస్‌ ఎంపీపీ నేతల నాగరాజు, పంచాయతీ కార్యదర్శి జీజీవీకే కుమార్‌, వివిధ శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-21T06:08:08+05:30 IST