ఎమ్మెల్యే గారూ.. ఇల్లు ఎప్పుడు ఇస్తారు?
ABN , First Publish Date - 2022-05-22T06:31:58+05:30 IST
టీడీపీ ప్రభుత్వ హయంలో ఇంటి కోసం నగరపాలక సంస్థకు రూ.50 వేలు చెల్లించామని ఇంతవరకు ఇల్లు మంజూరు కాలేదని, ఎప్పుడు మంజూరు అవుతుందని లబ్ధిదారులు... పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును నిలదీశారు.
గడప గడపకూ మన ప్రభుత్వంలోని ఎమ్మెల్యే వెలంపల్లిని నిలదీసిన స్థానికులు
విద్యాధరపురం, మే 21 : టీడీపీ ప్రభుత్వ హయంలో ఇంటి కోసం నగరపాలక సంస్థకు రూ.50 వేలు చెల్లించామని ఇంతవరకు ఇల్లు మంజూరు కాలేదని, ఎప్పుడు మంజూరు అవుతుందని లబ్ధిదారులు... పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావును నిలదీశారు. ఎమ్మెల్యే వారి ప్రశ్నలకు సమాధానం దాటవేస్తూ ప్రభుత్వ పథకాలు అందరికీ అందుతున్నాయి కదా అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 42వ డివిజన్ పరిధి భవానిపురం రిలయన్స్ ట్రెండ్సెట్ ఎదురుగా హెచ్బీకాలనీలో ప్రారంభమై టీచర్ కాలనీ వరకు ముగిసింది. స్థానికులు డివిజన్లో డ్రెయిన్ సమస్యల వల్ల తీవ్రంగా ఇబ్బందులకు గురి అవుతున్నామని ఎప్పుడు పరిష్కరిస్తారని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. టీచర్స్ కాలనీలో గంగిరెడ్డి శేషమ్మ, అడవిరెడ్డి దంపతులు తాము టీడీపీ ప్రభుత్వం హయంలో ఇంటి కోసం కార్పొరేషన్కు రూ.50వేలు చెల్లించామని ఇంతవరకు ఇల్లు రాలేదని ఎప్పుడు మంజూరు చేస్తారని ప్రశ్నించారు. పలుచోట్ల ఎమ్మెల్యేతో మాట్లాడటానికి పలువురు స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రాకపోవడంతో సచివాలయ సిబ్బందితో వారిని పిలిపించారు. కొందరు వచ్చారు, మరికొందరు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. తొలుత డివిజన్లో కార్యక్రమం ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే డివిజన్ వలంటీర్లు, సచివాలయం సిబ్బందితో స్థానిక సమస్యల గురించి తెలుసుకుని కార్యక్రమం ప్రారంభించారు.