‘మహా’ సంక్షోభం: తన భర్త కనిపించడం లేదంటూ సేన ఎమ్మెల్యే భార్య ఫిర్యాదు
ABN , First Publish Date - 2022-06-21T22:01:51+05:30 IST
మహారాష్ట్రలో హై పొలిటికల్ డ్రామా నడుస్తోంది. శివసేన టాప్ లీడర్ అయిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde) 21 మంది
ముంబై: మహారాష్ట్రలో హై పొలిటికల్ డ్రామా నడుస్తోంది. శివసేన టాప్ లీడర్ అయిన ఏక్నాథ్ షిండే (Eknath Shinde) 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్లోని సూరత్లో మెరిడియన్ హోటల్లో మకాం వేశారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్ అయింది. మరోవైపు, తన భర్త కనిపించడం లేదంటూ శివసేన ఎమ్మెల్యే నితిన్ దేశ్ముఖ్ భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నితిన్ దేశ్ముఖ్ బాలాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏక్నాథ్ షిండే శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేల్లో నితిన్ కూడా ఉన్నారు.
ఎమ్మెల్యే నితిన్ భార్య ప్రంజలి అకోలా పోలీస్ స్టేషన్లో లిఖిత పూర్వక ఫిర్యాదు చేస్తూ.. తన భర్తతో తాను చివరిసారి సోమవారం రాత్రి 7 గంటల సమయంలో మాట్లాడానని, ఆ తర్వాతి నుంచి ఆయన ఫోన్ స్విచ్చాఫ్లో ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భర్త ప్రాణానికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, సూరత్ వెళ్లిన దేశ్ముఖ్ అనారోగ్యం బారినపడడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్చినట్టు తెలుస్తోంది.