Minister KTR కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్.. నిరూపిస్తే రాజీనామా!
ABN , First Publish Date - 2021-09-15T15:59:51+05:30 IST
కేటీఆర్ విసిరిన సవాల్పై రాజాసింగ్ స్పందిస్తూ
- రాజ్యాంగ సూచన మేరకే నిధులు
- కాదని నిరూపిస్తే రాజీనామా..
హైదరాబాద్ సిటీ/మంగళ్హాట్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేస్తున్న యాత్రను చూసి మంత్రి కేటీఆర్ భయంతో ఏదేదో మాట్లాడుతున్నారని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు విషయంలో కేటీఆర్ విసిరిన సవాల్పై రాజాసింగ్ స్పందిస్తూ మంగళవారం ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. రాష్ట్రాల నుంచి వచ్చే ఆదాయం నుంచే దేశరక్షణతోపాటు అన్ని శాఖలు, రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం రాజ్యాంగంలో సూచించిన విధంగానే రాష్ట్రాలకు కేటాయించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు మనకు కేటాయిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం మంత్రి కేటీఆర్కు తెలియకుంటే తెలుసుకోవాలని హితవు పలికారు. తాను చెప్పిన విషయంలో తప్పుంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, నిజమైతే మంత్రి కేటీఆర్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమా అని సవాల్ విసిరారు.