Nara Bhuvaneswari మాటలు నిజమే.. అందుకే.. : MLA Roja
ABN , First Publish Date - 2021-12-21T17:46:30+05:30 IST
అసెంబ్లీలో జరిగిన ఘటనపై తిరుపతి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి..
తిరుపతి : అసెంబ్లీలో జరిగిన ఘటనపై తిరుపతి వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు. మంగళవారం నాడు మీడియా మీట్ నిర్వహించిన ఆమె.. భువనేశ్వరి వ్యాఖ్యలపై స్పందిస్తూ ఒకింత వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘ఆడవారిని ఏడిపించిన వారి పాపాన వారే పోతారని భువనేశ్వరి అన్న మాటలు నిజమే.. అందుకే 23 అసెంబ్లీ స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం అయ్యింది. చంద్రబాబు వల్లే భువనేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉంది.. మీరు (భువనేశ్వరి) జాగ్రత్తగా ఉండాలి. ఎన్టీఆర్ను ఏడిపించారు.. నన్ను కూడా ఏడిపించారు. చంద్రబాబు పాలనలో కాల్మనీ కేసులో మహిళలు వ్యభిచారం చేయాల్సి వచ్చింది. గోదావరి పుష్కరాల్లో 30 మహిళలు చనిపోయారు.. అప్పుడు భువనేశ్వరి ఎందుకు నోరు తెరవలేదు..?. జరగని దానికి జరిగిందని చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారు.. దానిపై భువనేశ్వరి మాట్లాడం అంటే రాజకీయ లబ్ది కోసం భార్యను రోడ్డుకు ఈడ్వడమే’ అని రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
భువనేశ్వరి ఏం మాట్లాడారు..!?
సోమవారం నాడు తిరుపతిలోని ట్రస్టు కార్యాలయంలో చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఇటీవల సంభవించిన వరదల్లో మృతి చెందిన 48 మంది కుటుంబాలకు ఎన్టీఆర్ ట్రస్టు తరపున నారా భువనేశ్వరి రూ.లక్ష చొప్పున అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అసెంబ్లీలో తన గురించి మాట్లాడినప్పుడు మామూలు మనిషిని కావడానికి తనకు వారం పది రోజులు పట్టిందన్నారు. ఆ సమయంలో తన కంటే ఎక్కువ దాడికి గురైన మహిళల గురించి ఆలోచించానని చెప్పారు. ‘రేప్లు మొదలు ఎన్నో రకాలుగా మహిళలు లింగ వివక్షకు, దాడులకు గురవుతున్నారు. నాకే పది రోజులు పడితే.. మరి అటువంటి వారు ఎలా తట్టుకుని, ఆ పరిస్థితి నుంచి బయటపడుతున్నారని ఆలోచించాను. అలాంటి వారికి మరింత శక్తి, ధైర్యం సమకూరాలని ప్రార్థించాను’ అని తెలిపారు.