Mulugu: ముంపు ప్రాంతాలకు Special package ప్రకటించాలి: MLA Seetakka
ABN , First Publish Date - 2022-07-17T18:57:23+05:30 IST
ముంపు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని ఎమ్మెల్యే సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ములుగు (Mulugu): ముంపు ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ (Special package) ప్రకటించాలని కాంగ్రెస్ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Seetakka) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆమె ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajyothy)తో మాట్లాడుతూ వరద బాధితులకు ఇళ్లు మంజూరు చేయాలన్నారు. పంట నష్టపోయిన రైతుల(farmers)కు పరిహారం చెల్లించాలని కోరారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా వారిని ఆదుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR) పర్యటనపై అధికారులకే క్లారిటీ లేదని, స్థానిక ఎమ్మెల్యేనైనా తనకు కూడా సమాచారం లేదని సీతక్క అన్నారు.
కాగా నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే సీతక్కకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న బోటు పెట్రోలు అయిపోవడంతో వాగు మధ్యలోనే ఆగిపోయింది. అనంతరం అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన నుంచి సీతక్క సురక్షితంగా బయటపడ్డారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లిలో ఈ ఘటన శనివారం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మండలంలోని బానాజీబంధం- ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్య జంపన్నవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా గ్రామస్థులు 12 రోజులుగా జలదిగ్బంధంలోనే ఉన్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే సీతక్క వరద బాధితులకు నిత్యావసర సరుకులు అందించేందుకు పడవలో ఆ గ్రామానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వాగు మధ్యలోకి చేరుకోగానే బోటు నిలిచిపోయింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి అదుపు తప్పిన బోటును ఒడ్డుకు తీసుకొచ్చే క్రమంలో చెట్టును ఢీకొని ఆగింది. దీంతో సీతక్కతోపాటు నాయకులు క్షేమంగా బయటకు వచ్చారు.