పార్టీ కోసం పనిచేసే NRI యువతకు ఎమ్మెల్యే టికెట్లు.. Chandrababu కీలక ప్రకటన

ABN , First Publish Date - 2022-05-23T16:16:02+05:30 IST

ప్రవాస తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బోస్టన్ నగరంలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడు ఆదివారం రాత్రితో ముగిసింది. రెండో రోజు ప్రారంభంలో చంద్రబాబు జూమ్ కాల్ ద్వారా ప్రసంగించారు.

పార్టీ కోసం పనిచేసే NRI యువతకు ఎమ్మెల్యే టికెట్లు.. Chandrababu కీలక ప్రకటన

బోస్టన్ లో ముగిసిన మహానాడు

ప్రవాసులను ఆకట్టుకున్న చంద్రబాబు ప్రసంగం

భారీ ప్రదర్శన మూడు వేల మందికి పైగా హాజరు

బోస్టన్ నుండి 'ఆంధ్రజ్యోతి' ప్రత్యేక ప్రతినిధి  కిలారు ముద్దుకృష్ణ


ప్రవాస తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బోస్టన్ నగరంలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడు ఆదివారం రాత్రితో ముగిసింది. రెండో రోజు ప్రారంభంలో చంద్రబాబు జూమ్ కాల్ ద్వారా ప్రసంగించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో చురుకుగా పని చేసే  ప్రవాస యువకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని అన్నారు. దాదాపు అరగంట పాటు సాగిన ఆయన ప్రసంగం ప్రవాసులను ఆకట్టుకుంది. వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. మహానాడు ముగింపు సందర్భంగా పార్టీ అధ్యక్షుడు అచ్చెనాయుడు ప్రసంగించారు. దాదాపు మూడు వేల మందికి పైగా ఎన్నారై తెలుగుదేశం కార్యకర్తలు అమెరికా నలుమూలల నుండి తరలి వచ్చారు. ఎన్నారై  తెదేపా కన్వీనర్ కోమటి జయరాం స్వాగతం పలికారు.


కార్లు మోటార్ సైకిళ్లతో భారీ ప్రదర్శన

మహానాడు జరుగుతున్న రాయల్ ప్లాజా సమావేశ మందిరం ఆవరణలో శనివారం సాయంత్రం భారీ ప్రదర్శన నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా కాలుస్తూ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఊరేగిస్తూ జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు ఇచ్చారు. పెద్దపెద్ద  జెండాలు కట్టి మోటార్ సైకిళ్లు కార్లు  హారన్లు మోగిస్తూ కార్యకర్తల సందడి చేశారు. హెలికాప్టర్ ద్వారా ప్రదర్శనపై పూల వర్షం కురిపించారు. మహానాడు సందర్భంగా రెండు రోజులపాటు తెలుగు వంటకాలతో పసందైన విందు భోజనాన్ని అందించారు. తెలంగాణకు చెందిన పార్టీ సీనియర్ నేత నన్నూరి నర్సిరెడ్డి ప్రసంగం  ఆకట్టుకుంది. పార్టీ సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ ఎం.వీ.ఎస్.ఎన్. రాజు, గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు, కందుల నారాయణరెడ్డి తదితరులు ప్రసంగించారు.



Updated Date - 2022-05-23T16:16:02+05:30 IST