ఏపీ వైసీపీలో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు..

ABN , First Publish Date - 2020-11-12T16:32:35+05:30 IST

వైసీపీలో అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి. లుకలుకలు బయటపడ్డాయి.

ఏపీ వైసీపీలో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు..

అమరావతి: వైసీపీలో అంతర్గత విబేధాలు రచ్చకెక్కాయి. లుకలుకలు బయటపడ్డాయి. ముఖ్య నేతలు, మంత్రులపై ఎమ్మెల్యేలు బాహటంగానే విమర్శలు ఎక్కుపెట్టారు. నేరుగా ఆరోపణలు గుప్పించారు. ఈ పరిణామాలు దేనికి సంకేతం? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు మధ్య పొసగడంలేదా? ముఖ్య నాయకులకు, మంత్రులకు, ఇతర ప్రజా ప్రతినిధులకు దూరం పెరిగిందా? అంతర్గతంగా విబేధాలు రగులుతున్నాయా? ప్రధానంగా ఎమ్మెల్యేలను మంత్రులు, ఇతర ముఖ్య నాయకులు పక్కనపెడుతున్నారా? తాజా పరిణామాలు అవుననే సంకేతాలు ఇస్తున్నాయి. వైసీపీ సర్కారులో లుకలుకలను బయటపెట్టాయి. ఈ పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా  చర్చను లేవనెత్తాయి.


ఎంపీ విజయసాయిరెడ్డిపై ఓ ఎమ్మెల్యే నేరుగానే విరుచుకుపడ్డారు. అధికారులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులముందే విజయసాయి తీరును ఎండగట్టారు. విశాఖలో జరిగిన డీడీఆర్సీ సమావేశం దీనికి వేదిక అయింది. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఇదే సమావేశంలో అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్ కూడా తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా  జరుగుతున్న ‘నాడు-నేడు’ పనుల్లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. అధికారులు చిన్నచూపు చూస్తున్న వైనాన్ని జిల్లా అభివృద్ధి సమీక్షామండలి సమావేశంలో వివరించారు. తూ.గో. జిల్లాలో మరో ఎమ్మెల్యే ఏకంగా మంత్రుల వ్యవహారశైలిని కడిగిపారేశారు. మంత్రులు తమ పాలిట దుష్ట శక్తుల్లా పరిణమించారని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. తమ మాటలు పట్టించుకునేవాళ్లే కరువయ్యారని, అభివృద్ధి పనులు అందుకే జరగడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పి. గన్నవరం ఎమ్మెల్యే  చిట్టిబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2020-11-12T16:32:35+05:30 IST