సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: అశోక్బాబు
ABN , First Publish Date - 2021-04-23T15:18:16+05:30 IST
గత వారం రోజుల్లో ఐదుగురు సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్సీ అశోక్బాబు అన్నారు.
అమరావతి: గత వారం రోజుల్లో ఐదుగురు సెక్రటేరియట్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఎమ్మెల్సీ అశోక్బాబు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారని మండిపడ్డారు. తాజాగా లేబర్ విభాగం ఎస్ఓ అజయ్ బాబు కరోనా సోకి మృతి చెందారని తెలిపారు. సీఎం జగన్ తాడెపల్లి ప్యాలెస్ నుంచి బయటకి రాకుండా ఉద్యోగులను మాత్రం విధులకు రావాలనడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఉద్యోగులు రోజుకొకరు పిట్టల మాదిరి రాలి పోతుంటే సీఎం జగన్ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని దుయ్యబట్టారు. మృతి చెందిన ఉద్యోగులకు కోటి రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సీఎం కళ్లు తెరిచి సెక్రటేరియట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోంకు అవకాశం కల్పించాలని అశోక్బాబు తెలిపారు.