అవును.. కొట్టి చంపేశారు!!
ABN , First Publish Date - 2022-05-23T09:11:08+05:30 IST
ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యంది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారణ అయింది.
- ఏపీలో ఎమ్మెల్సీ కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యానిది హత్యే!
- పోస్టుమార్టంలో స్పష్టం.. పోలీసులకు ప్రాథమిక నివేదిక
(కాకినాడ, ఆంధ్రజ్యోతి): ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ డ్రైవర్ సుబ్రహ్మణ్యంది ముమ్మాటికీ హత్యేనని నిర్ధారణ అయింది. రోడ్డు ప్రమాదమంటూ ఎమ్మెల్సీ చెప్పిందంతా కట్టుకథేనని తేలిపోయింది. పోస్టుమార్టంలో నివ్వెరపరిచే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. తీవ్రంగా కొట్టడంతోపాటు గొంతుమీద కాలేసి తొక్కడంతో ఊపిరాడక గుండె ఆగిపోయి సుబ్రహ్మణ్యం చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. కొన్ని అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్ ఫోరెన్సిక్ నిపుణులు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికను ఆదివారం మధ్యాహ్నం పోలీసులకు అందించారు. మంగళగిరిలోని స్టేట్ ఫోరెన్సిక్ ల్యాబ్కు కొన్ని శాంపిల్స్ను సోమవారం పంపనున్నారు. వాటి ఫలితాలొచ్చాక పూర్తి నివేదిక సమర్పిస్తారు. ఎమ్మెల్సీ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. కానీ అరెస్టు చూపకుండా తాత్సారం చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కోర్టు సెలవు కావడంతో సోమవారం మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టి.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు.. వైసీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు జిల్లా ఎస్పీని ఆదివారం కలిసినట్లు సమాచారం. అలాగే ఉదయభాస్కర్ కూడా వైసీపీ పెద్దలతో మంతనాలు జరిపారని.. బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అంత్యక్రియలు పూర్తి..
ఎమ్మెల్సీని అరెస్టు చేస్తామని, హత్య కేసు నమోదు చేస్తామని పోలీసులు ప్రకటించిన దరిమిలా శనివారం అర్ధరాత్రి సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులు శవపంచనామాకు అంగీకరించారు. దీంతో ఒంటిగంట సమయంలో ఈ ప్రక్రియను వైద్యులు ప్రారంభించారు. శవపంచనామా మొత్తాన్ని వీడియోగ్రఫీ చేశారు. భౌతిక కాయాన్ని సుబ్రహ్మణ్యం స్వగ్రామమైన పెదపూడి మండలం గొల్ల మామిడాడకు తరలించారు. ఆదివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యం మృతిపై సర్పవరం స్టేషన్లో హత్య కేసు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు.
చంపింది ఎక్కడ..?
సుబ్రహ్మణ్యాన్ని ఎలా చంపారు.. ఎక్కడ చంపారో తెలుసుకునేందుకు పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు. దీనిపై ఉదయభాస్కర్తోపాటు హత్య జరిగిన సంఘటన స్థలంలో ఉన్న ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు తెలిసింది. సుబ్రహ్మణ్యం రోడ్డుప్రమాదానికి గురయ్యాడని, కాకినాడ అమృత ఆస్పత్రికి తరలించి కారులోనే ఉంచి వైద్యుడితో పరీక్ష చేయిస్తే చనిపోయాడని నిర్ధారించారని ఉదయభాస్కర్.. సుబ్రహ్మణ్యం కుటుంబసభ్యులకు చెప్పిన నేపథ్యంలో.. పోలీసులు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. అందులో గురువారం అర్ధరాత్రి 1.30 గంటలకు ఎమ్మెల్సీ ఉదయభాస్కర్ కారులో ఆస్పత్రికి వచ్చినట్లు కనిపిస్తోంది. అప్పటికే వైద్యులతో ఫోన్లో మాట్లాడడంతో.. వాళ్లు బయటకు వచ్చి కారు వెనుక సీటులో అపస్మారక స్థితిలో పడి ఉన్న సుబ్రహ్మణ్యాన్ని ఏడు నిమిషాలపాటు పరీక్షించి.. చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో 1.40 గంటలకు సుబ్రహ్మణ్యాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకెళ్లిపోయినట్లు సీసీటీవీలో గుర్తించారు. నాగమల్లితోట జంక్షన్ వద్ద ప్రమాదం జరిగిందని ఉదయభాస్కర్ చెప్పడంతో అక్కడి సీసీ ఫుటేజీని కూడా పరిశీలించారు. కానీ ఆ రోజు అక్కడ రోడ్డు ప్రమాదమేదీ జరగలేదని సర్పవరం సీఐ దర్యాప్తులో తేల్చారు. దీనిని బట్టి ముందే హత్య చేసి రోడ్డు ప్రమాదమనే కట్టుకథ అల్లారని.. అది నిజమని చెప్పడానికి కావాలనే మృతదేహాన్ని అమృత ఆస్పత్రి వద్దకు తెచ్చినట్లు తెలుస్తోంది. కాగా, సుబ్రహ్మణ్యానిది హత్యేనని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఎమ్మెల్సీ తప్పుచేస్తే కచ్చితంగా శిక్ష పడుతుందని తెలిపారు.