‘అనంత’ కేసును నీరుగార్చేందుకు కుట్ర
ABN , First Publish Date - 2022-05-24T06:11:48+05:30 IST
ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు.
టీడీపీ ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
పెదపూడి, మే 23: ఎమ్మెల్సీ అనంత ఉదయభాస్కర్ మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం కేసును పోలీసులు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. గొల్లల మామిడాడలో సోమవారం ఆయన సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను పరామర్శించి టీడీపీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ సుబ్రహ్మణ్యం భార్య అపర్ణ కోరిక మేరకు సీబీఐతో కేసు విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సుబ్రహ్మణ్యం భార్యను మహిళ, గర్భిణి అని కూడా చూడకుండా రాత్రి వేళ విచారణ పేరిట పిలవడం వెనుక ఆంతర్యం ఏమిటన్నారు. అనంతబాబు అరెస్టును స్థానిక ఎమ్మెల్యే ఎందుకు డిమాండ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. అనంతబాబును అరెస్టు చేసి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని అంతవరకు టీడీపీ పోరాటం చేస్తుందన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఎస్సీ సెల్ అఽధికార ప్రతినిధి చిర్రా వరప్రసాదరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి సూర్యప్రకాశ్, అనపర్తి నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు స్వామి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు మందపల్లి సత్యనారాయణ, పెదపూడి సర్పంచ్ కలవల కృష్ణమూర్తి, టీడీపీ మండలాధ్యక్షుడు జుత్తుగ కృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు తోట విజయరావు, కందుకూరి వెంకటరమణ, చంద్రరావు, టీడీపీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి మూకల శ్రీరాములు ఉన్నారు.