ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేయాలి
ABN , First Publish Date - 2021-03-01T04:36:58+05:30 IST
హైదరాబాద్ -రంగారెడ్డి-మహబూబ్ నగర్ శాసన మండలి పట్ట భద్రుల
- మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎన్నికల పరిశీలకుడు హరిప్రీత్సింగ్
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్జిల్లా ప్రతినిధి) : హైదరాబాద్ -రంగారెడ్డి-మహబూబ్ నగర్ శాసన మండలి పట్ట భద్రుల ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఎన్నికల అబ్జర్వర్ హరిప్రీత్ సింగ్ సూచించారు. మేడ్చల్ మల్కాజ్గిరిజిల్లాలోని మల్కాజ్గిరి సైనిక్పురిలోని భవన్స్ రామకృష్ణ విద్యా లయ, అబ్దుల్కాలం ఆడిటోరియం, ద్రోణాచార్య స్పోర్ట్స్ కాంప్లెక్సులో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు. అనం తరం ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై ఏర్పాటుచేసిన శిక్షణా కార్యక్రమంలో మాట్లాడారు. ప్రతిఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. శిక్షణలో ఏమైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేసుకొని, విధులను సక్రమంగా నిర్వర్తించాలని సూచించారు. కలెక్టర్ శ్వేతా మహంతి మాట్లాడుతూ.. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు తప్పనిసరిగా కొవిడ్-19 నిబంధనలు పాటించడంతో పాటు ఓటు వేసేందుకు వచ్చేవారికి సైతం జాగ్రత్తలు పాటించేలా చూడాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగినచర్యలు తీసుకుంటామని, ఏమైనా సందేహా లుంటే జిల్లా యంత్రాంగం దృష్టికి తేవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విద్యాసాగర్, జడ్పీ సీఈవో దేవసహాయం, డీఆర్వో లింగ్యానాయక్, ఏవో వెంకటేశ్వర్లు, స్థానిక తహసీల్దార్ ప్రమీల పాల్గొన్నారు.