టీఆర్ఎస్ గెలుపులో కురుమల పాత్ర మరువలేనిది: ఎమ్మెల్సీ కవిత
ABN , First Publish Date - 2021-03-04T21:43:27+05:30 IST
కురుమ కులస్తుల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.
హైదరాబాద్: కురుమ కులస్తుల మేలుకోరే పార్టీ టీఆర్ఎస్ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. గురువారం కవితని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కురుమ సంఘ సభ్యులు కలిశారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కురుమ సంఘం ప్రతినిధులతో హైదరాబాద్లో కవిత సమావేశమయ్యారు. ఈసందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం పథకాల ఫలాలు కురుమలందరికీ అందాలన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ చేయని సంక్షేమ కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ గొల్ల కురుమల కోసం అమలు చేస్తున్నారని చెప్పారు. గొల్ల కురుమలు నిరంతరం టీఆర్ఎస్కి మద్దతుగా నిలుస్తున్నారని కల్వకుంట్ల కవిత తెలిపారు.
టీఆర్ఎస్ గెలుపులో వారి పాత్ర మరువలేనిదన్నారు. యాదవులు సీఎం గా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇవ్వనన్ని నిధులు, తెలంగాణలో గొల్ల కురుమలకు కేసీఆర్ ఇచ్చారని చెప్పారు.స్థానిక సంస్థల ప్రతినిధులైన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు నేరుగా బడ్జెట్ నుంచే నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్ని కోరుతామని కవిత చెప్పారు.కరోనా కారణంగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలోనే అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కామారెడ్డిలో కురుమ సంఘం భవన నిర్మాణం పూర్తయిన అనంతరం అక్కడే సభ నిర్వహిస్తామని కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు తుల ఉమ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కురుమ సంఘం అధ్యక్షుడు కేశ వేణు, ప్రధాన కార్యదర్శి వొరక దేవన్న, సంఘ నాయుకులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్కి ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ మద్దతు
ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ ( UTA-TS) గురువారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ టీఆర్ఎస్కి మద్దతు ప్రకటించింది. ఈమేరకు అసోసియేషన్ అధ్యక్షుడు కుతుబుద్దీన్, ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ కవితకు మద్దతు లేఖను అందజేశారు. అసోసియేషన్కు చెందిన 7000 మంది సభ్యులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు మద్దతుగా నిలుస్తామని తెలిపారు.