మున్సిపల్‌ పాఠశాలలను పరిరక్షించండి

ABN , First Publish Date - 2022-05-29T03:59:04+05:30 IST

మున్సిపల్‌ పాఠశాలలను పరిరక్షించాలని మున్సిపల్‌ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు.

మున్సిపల్‌ పాఠశాలలను పరిరక్షించండి
మాట్లాడుతున్న జేఏసీ నేతలు

జేఏసీ నేతలు డిమాండ్‌ 

నెల్లూరు (విద్య), మే 28 : మున్సిపల్‌ పాఠశాలలను పరిరక్షించాలని మున్సిపల్‌ ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు డిమాండ్‌ చేశారు. నగరంలోని దర్గామిట్ట ఎంసీ యూపీఎస్‌ పాఠశాలలో శనివారం నిర్వహించిన సమావేశంలో నేతలు మాట్లాడుతూ మున్సిపల్‌ పాఠశాలలు, ఉపాధ్యాయులు, యాజమాన్య భవనాలు, ఆస్తులతో సహా పాఠశాల విద్యాశాఖలో విలీనం చేస్తానన్న ప్రతిపాదనలు సరైనవి కాదన్నారు. బ్రిటీష్‌ హయాంలో ఎంతో మంది దాతలు పిల్లల విద్యాభివృద్ధి కోసం అందించిన ఆస్తులతో ఈ పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. 74వ రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక సంస్థలకు ప్రత్యేకాధికారులు కల్పించడం ద్వారా కౌన్సిల్‌ నిర్వహణలో ఇవి కొనసాగుతున్నాయన్నారు. 2016లో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశ పెట్టిన నాటి నుంచి విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగి ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో మున్సిపల్‌ పాఠశాలలను విద్యాశాఖకు అప్పగించడం అన్యాయమన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు ఎంసీ.అచ్చయ్య, జి.రాజమనోహర్‌, పి.వేణుగోపాల్‌, టి.సురేష్‌బాబు, ధనరాజ్‌, టి.వీరభద్రుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-29T03:59:04+05:30 IST