Indian Railway Land : మోదీ మంత్రివర్గం కీలక నిర్ణయం
ABN , First Publish Date - 2022-09-07T22:04:56+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే భూముల విధానాన్ని సవరించి, రైల్వే భూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించారు. కౌలు కాలాన్ని కూడా ఐదేళ్ళ నుంచి 35 ఏళ్ళకు పెంచారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Thakur) మీడియాకు ఈ వివరాలను తెలిపారు.
అనురాగ్ ఠాకూర్ మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, రైల్వే భూమి విధానాన్ని సవరించేందుకు కేంద్ర మంత్రివర్గ ఆమోదం తెలిపింది. రానున్న ఐదేళ్ళలో 300కు పైగా గతి శక్తి కార్గో టెర్మినల్స్ను అభివృద్ధి చేయాలని, రైల్వే ల్యాండ్ లైసెన్స్ ఫీ (LLF)ను 6 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. లీజు పీరియడ్ను ఐదేళ్ళ నుంచి 35 ఏళ్ళకు పెంచేందుకు ఆమోదించింది.
నూతన విధానం వల్ల కొత్తగా దాదాపు 1.2 లక్షల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అనురాగ్ చెప్పారు. మరోవైపు రైల్వేలు కూడా మరింత ఎక్కువ ఆదాయాన్ని పొందగలుగుతాయని తెలిపారు. భూమి లీజు కాలాన్ని పెంచడం వల్ల మరిన్ని కార్గో టెర్మినల్స్ నిర్మాణానికి, ఎక్కువ మంది పెట్టుబడిదారులను ఆకర్షించడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రైవేటీకరణ మరింత ఆకర్షణీయం అవుతుందన్నారు. భూమి లైసెన్స్ ఫీజు చాలా ఎక్కువగా ఉందని పెట్టుబడిదారులు గతంలో చెప్పారని తెలిపారు. లీజు కాలాన్ని కూడా పెంచాలని కోరారని చెప్పారు.
కంటెయినర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, యాజమాన్య నియంత్రణను బదిలీ చేయాలని 2019 నవంబరులో కేంద్ర కేబినెట్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 30.8 శాతం వాటాలు ఉన్నాయి. ఈ వాటాల అమ్మకం ద్వారా రూ.8,000 కోట్లు సంపాదించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.