7th Pay Commission Good News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్!.. బుధవారం ప్రకటించే ఛాన్స్..
ABN , First Publish Date - 2022-09-26T23:43:53+05:30 IST
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అతిత్వరలోనే గుడ్న్యూస్ వెలువడనుంది. 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సు చేసిన 4 శాతం డీఏ (Dearness allowance) పెంపుపై కేంద్రం రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయి.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అతిత్వరలోనే గుడ్న్యూస్ అందబోతోంది. 7వ వేతన సంఘం (7th Pay Commission) సిఫార్సు ప్రకారం 4 శాతం డీఏ (Dearness allowance) పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైందని, రెండు రోజుల్లో ప్రకటన వెలువడే అవకాశాలున్నాయని రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నిరీక్షణకు శుభంకార్డు పడే సూచనలున్నాయి. అయితే డీఏ పెంపు ప్రకటన తేదీపై కేంద్రప్రభుత్వం(central govt) ఇంతవరకు అధికారిక ప్రకటనేమీ చేయలేదు. సెప్టెంబర్ 28న (బుధవారం) ప్రధాని నరేంద్ర మోడీ(narendra modi) డీఏ, డీఆర్(dearness relief) పెంపుపై ప్రకటన చేయవచ్చునని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం కేంద్రప్రభుత్వ ఉద్యోగుల డీఏ రేటు 34 శాతంగా ఉంది. 7వ వేతన సంఘం సిఫార్సులకు అనుగుణంగా డీఏని ఏడాదిలో రెండుసార్లు సవరించడంతో ఈ స్థాయిలో ఉంది. మొదటసారి జనవరి నుంచి జూన్ వరకు.. కాగా రెండవది జులై నుంచి డిసెంబర్ వరకు కేంద్రం పెంచింది. ధరల పెరుగుదల నేపథ్యంలో మార్చి 30న చేసిన డీఏ పెంపు ప్రకటనతో 1.16 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలిగిన విషయం తెలిసిందే. 3 శాతం పెంచగా డీఏ 31 శాతం నుంచి 34 శాతానికి పెరిగింది.